న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే వార్తలతో మళ్లీ హుషారుగా ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత డబ్బులు విడుదలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లబ్ధిదారులైన రైతులు రూ.2,000 చెల్లింపులు ఎప్పుడు తమ ఖాతాల్లోకి వస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాటిపై తాజా సమాచారం మేరకు, పీఎం కిసాన్ పథకంలోని 20వ విడత జూలై 18న విడుదలయ్యే అవకాశం ఉంది. గత 19వ విడత ఫిబ్రవరిలో విడుదల కాగా, ఆ తర్వాతి విడత జూన్లో రాలేదు. ఆలస్యం కారణంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే, పలు నివేదికల ప్రకారం జూలై 18న బీహార్లోని మోతీహరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని సమాచారం. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఈ మొత్తం పొందేందుకు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను ముందే పూర్తి చేసి ఉండాలి. అందులో భాగంగా భూమి రికార్డుల అప్డేట్, బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ చేయడం, e-KYC పూర్తి చేయడం వంటి ముఖ్యమైన దశలను రైతులు పాటించాల్సి ఉంటుంది.
భూమి రికార్డులు అప్డేట్ చేయడం ఎలా?
- పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ (https://pmkisan.gov.in)కి వెళ్లాలి.
- హోమ్పేజీలో ఉన్న ‘Farmer Corner’ సెక్షన్లో ‘State Transfer Request’ ఎంపిక చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ నమోదు చేయాలి.
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘Get OTP’పై క్లిక్ చేయాలి.
- OTP నమోదు చేసి, మీ భూమి రికార్డుల ఆధారంగా ‘అగ్రికల్చర్ ల్యాండ్ ప్రూఫ్’ అప్లోడ్ చేయాలి.
- తర్వాత ఫారమ్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి.
ఇతర అవసరమైన ప్రక్రియలు:
- బ్యాంక్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాలి.
- DBT (Direct Benefit Transfer) యాక్టివ్గా ఉండాలి.
- e-KYC ప్రక్రియను పూర్తిచేయాలి.
- ఆధార్ సీడింగ్ స్టేటస్ను ‘Know Your Status’ మాడ్యూల్ ద్వారా చెక్ చేసుకోవాలి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేయండి:
- https://pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- హోమ్పేజీలో ఉన్న ‘Dashboard’ ట్యాబ్పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, మండల, గ్రామం వివరాలు ఎంచుకొని ‘Get Report’పై క్లిక్ చేయండి.
- అక్కడ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.
ఈ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేస్తేనే రైతులు 20వ విడతలో తమ ఖాతాల్లో రూ.2,000 చెల్లింపులను పొందగలుగుతారు. కాబట్టి సంబంధిత పనులను ఇప్పుడే పూర్తి చేసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.






























