మనిషి జీవితంలో డబ్బు ముఖ్య పాత్ర పోషిస్తోంది. డబ్బు వల్లే కష్టాలు ఎదురైతే ఆ బాధ వర్ణానాతీతం. సమయానికి అందాల్సిన డబ్బు అందకపోయినా, అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు లేకపోయినా జీవితం తలక్రిందులవుతుంది. తాజాగా చోటు చేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే కన్నీళ్లాగవు. కర్నూలు జిల్లాలోని సి బెళగల్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి కర్నూలులోని సి బెళగల్ మండళానికి చెందిన రాముడు, సత్యవతి దంపతుల ఏకైక కుమారుడు వినోద్ కు నాలుగేళ్ల క్రితం ప్రశాంతి అనే యువతితో వివాహం జరిగింది. వినోద్ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ దంపతులకు ఒక బాబు కాగా భార్య మరోసారి గర్భవతి కావడంతో ఆమెను కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రశాంతి తల్లిదండ్రులు చేర్పించారు.
ప్రశాంతి కొడుకుకు జన్మనిచ్చిందని ఆమె తల్లిదండ్రులు వినోద్ కు తెలిపారు. వినోద్ కొడుకును చూడటానికి మొదట తల్లిని పంపించాడు. ఆ తరువాత తను కర్నూలుకు వెళ్లాలని అనుకున్నా చేతిలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కరోనా, లాక్ డౌన్ వల్ల వినోద్ గత కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో ఇంట్లో దులానికి తాడు కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
వినోద్ ఆత్మహత్యకు డబ్బే ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. అతని ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సందర్భాల్లో సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి సమయంలో ఆ కష్టాలను తట్టుకొని నిలబడితేనే జీవితంలో గొప్ప విజయాలను సొంతం చేసుకోగలుగుతామని నిపుణులు సూచిస్తున్నారు.
































