వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు చుట్టుముడుతాయి. నీళ్లు మారడం, వాతావరణం మారడం… ఇలా కారణం ఏదైనా కావొచ్చు… చాలామంది అనారోగ్యం బారిన పడుతుంటారు. పరిసరాలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. లేదంటే దోమలు చేరి కొత్త వ్యాధులకు దారి తీస్తాయి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో కూడా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ ఒక్కటి తింటే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది.

అయితే ఈ కాలంలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
స్నేహితులు అయినా.. కుటుంబసభ్యులు అయినా బయట చల్లని వర్షం పడుతుంటే.. ఇంట్లో వేడి వేడి చాయ్ లేదా బజ్జీలు, పకోడి లాంటివి తినాలని అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి ఆహారపదర్ధాలు తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇవి ఎక్కువగా నూనెలో ఉంటాయి. దీంతో జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అల్ల నేరేడు, ఆల్ బుకారా, చెర్రీలు, దానిమ్మ పండ్లు వంటి వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి.
ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఈ పండ్లను తీసుకునేటప్పుడు కట్ చేసి పక్కన పెట్టడం ఆ తర్వాత తినడం కంటే ఒకేసారి పండును పూర్తిగా తినడం మంచిది. సాధారణంగా అన్నం తిన్న తర్వాత చివరగా పెరుగుతో అన్నం తినడం చాలామందికి అలవాటు. అయితే ఈ పెరుగు జీర్ణ శక్తిని పెంచుతూ.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపులోని హానికారకమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. అందువల్ల పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలని అనిపిస్తే నూనెలో ఎక్కువగా ఉండే వాటిని కాకుండా.. సూప్ లాంటివి తీసుకోవడం మంచిది.
చాయ్ తాగాలనిపిస్తే అల్లం టీ తాగడం మంచిది. ఇది వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అందుకే వర్షాకాలంలో అల్లం టీ తాగేందుకు ప్రయత్నించాలి. చేదు అనేది మన శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే వర్షాకాలంలో కాకరకాయ కూర, మెంతులు, వేపాకు, పసుపు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక డ్రై ఫ్రూట్స్ అంటే.. వాల్ నట్స్, పిస్తా పప్పు, అవిసె గింజలు లాంటివి కూడా తింటే.. ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా .. ఇమ్యూనిటీని పెంచుతాయి.




























