RRR Ticket Rates: మొన్నటి వరకు ఏపీలో సినిమా టికెట్ల లొల్లి నడిచింది. అయితే ఎవరు ఏం చెప్పినా ప్రభుత్వం మాత్రం.. వాళ్లు నిర్ణయించిన ధరకే సినిమా టికెట్లను అమ్మాలని మొండి పట్టు పట్టారు. థియేటర్లు కూడా అలానే నడిచాయి. దీంతో నానీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఇదే విషయంలో ఏపీ కంటే.. తెలంగాణ కాస్త బెటర్ అనే చెప్పాలి. టికెట్ రేట్ల విషయంలో సీఎం కేసీఆర్.. సినీ ప్రముఖలకే వదిలేయడం.. అంతే కాకుండా.. పుష్ప సినిమాకు ఐదు షోల వరకు అనుమతి ఇవ్వడం చెప్పుకోదగిన విషయమే. దీని కారణంగా నిర్మాతలు కాస్త లాభ పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంపై ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 120 గురించి చర్చించారు. సినిమాల టికెట్ ధరలు ఎలా ఉండాలని విషయాలపై విపులంగా చర్చించుకున్నారు. జీవో నెంబర్ 120 ప్రకారం.. చిన్న సినిమా టికెట్ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది.
ఇక చిన్న సినిమా కాకుండా.. పెద్ద సినిమా కాకుండా.. మధ్య స్థాయి సినిమా విడుదలైన రెండు వారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలైతే.. గరిష్ఠ ధరతో మూడువారాల పాటు టికెట్లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిబంధనలు ప్రతీ ఒక్కరు పాటించాలి..
అయితే ప్రభుత్వం చెప్పిన ఈ నిబంధనలను బేఖాతరు చేసి.. కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా నిర్ణయించిన టికెట్ ధరలనే పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు టికెట్ ధరలను కూడా నిర్ణయించింది ఫిల్మ్ ఛాంబర్. ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్ పై రూ. 175, మల్టీప్లెక్స్లో అయితే రూ.295 టికెట్ ధర ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇదే విషయంపై ఏషియన్ సునీల్ మాట్లాడుతూ.. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని కోరాడు.






























