ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు నాణ్యమైన సరుకులను అందుబాటు ధరల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మినీ మార్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో వెయ్యి మార్టులను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఉపశమనం కలిగించేలా ఈ మార్టుల్లో బియ్యం, పప్పులు, గోధుమలు, నూనెలు వంటి వస్తువులను విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్కూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ మినీ మార్టులను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రైతుల నుంచి నేరుగా సరుకులు సేకరించి వినియోగదారులకు చేరవేయడం ద్వారా మధ్యవర్తుల ప్రభావం తగ్గించి ధరలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంది పప్పు, మినపప్పు వంటి వస్తువులను కూడా తక్కువ ధరకే అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇక అరకు కాఫీని దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేలా మిలిటరీ క్యాంటీన్లలో ప్రవేశపెట్టే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. కొత్త రేషన్ కార్డుల్లో క్యూ ఆర్ కోడ్ విధానం ప్రవేశపెట్టడంతో కుటుంబ వివరాలు, సరుకుల వినియోగ సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం కలిగింది. రేషన్ దుకాణాల్లో ఇప్పటికే బియ్యం, చక్కెరతో పాటు మిల్లెట్స్ సరఫరా కొనసాగుతుండగా, త్వరలో మరిన్ని సరుకులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.



























