వైసీపీ లోక్ సభ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజురోజుకు తన విమర్శల్లో పదును పెంచుతున్నారు. తాజాగా మరోమారు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి రఘురామ కృష్ణంరాజు కులాల ప్రస్తావన తెచ్చి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ తాను క్షత్రియుడినని రెడ్డిని కాదని తాను ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు పడనని వ్యాఖ్యానించారు.

రెడ్డి అని పేరు చివర ఉండేవాళ్లు తనను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారని.. తనను ఎవరూ ఏమీ పీకలేరని.. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఏపీకి వెళితే తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అధికారులను తాను తిట్టినట్టు తనపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని.. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. మరోమారు జగన్ పదవి గురించి రఘురామ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ పదవి పోతే ఆయన తల్లి లేదా భార్య సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయని.. భారతికి మంచి తెలివితేటలు ఉన్నాయని ఆమె జగన్ కంటే ఎక్కువ చదువు చదువుకున్నారని వెల్లడించారు. న్యాయానికి సంకెళ్లు వేయడానికి కొంతమంది చెదల్లా ఏపీలో ప్రవర్తిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానాలు ఆ చెద పురుగులను సమూలంగా నాశనం చేస్తాయని అన్నారు. ప్రజలు చెదపురుగులు ఎవరో బాగా తెలుసని వ్యాఖ్యలు చేశారు.
తనది ఆంబోతు ధైర్యం అని చాలామంది తన గురించి మేకపోతు గాంభీర్యం అని అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. రఘురామ మరోమారు సీఎం జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































