ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాపై స్పందించారు. ఈ చిత్రం కంటెంట్ పరంగా బాగున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహకరమైన ఫలితాన్ని అందుకుందని వ్యాఖ్యానించారు. సినిమా భారీ స్థాయిలో రూపొందించినా, భక్తి ఎలిమెంట్స్ను లోతుగా చూపించకపోవడమే ప్రధాన లోపమని అభిప్రాయపడ్డారు. పాన్ ఇండియా రేంజ్ కోసమే ఎక్కువ దృష్టి పెట్టారని, కానీ కథకు తగ్గట్లు మానసిక సంబంధాన్ని పెంచే ప్రయత్నం తగ్గిపోయిందని చెప్పారు.

రూపాయి 200 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం, పదిరోజుల పాటు ఆడినప్పటికీ రూ. 50 కోట్ల మార్క్ను కూడా అందుకోలేకపోయినట్లు తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మాత మోహన్ బాబుకి భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోందని తెలిపారు. తాను సినిమా చూసినట్లు చెబుతూ, “కథలో ఉన్న భక్తి కాన్సెప్ట్ను పటిష్టంగా చూపించి ఉంటే సినిమా రూ.1000 కోట్లు వసూలు చేసేది” అన్నారు.
అయితే, సినిమాలో శివుడు పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించినప్పుడు “ఇరిటేషన్ వచ్చింది” అని స్పష్టం చేశారు. మిగిలిన పాత్రలు మాత్రం బాగున్నాయని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. కన్నప్ప సినిమా చూస్తుంటే అన్నమయ్య తరహా కంటెంట్ గుర్తుకు వచ్చిందని, కాన్సెప్ట్ అవుట్డేటెడ్గా అనిపించిందన్నారు.
అయినప్పటికీ విష్ణు ప్రయత్నాన్ని కొనియాడుతూ, “కష్టపడాడు, సినిమా పట్ల సమర్పణతో ఉన్నాడు. రివ్యూల పరంగా బ్యాడ్ రిపోర్ట్ మాత్రం రాలేదు. ఒక్కసారి అయినా చూడాల్సిందే అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి” అని చెప్పారు. మొత్తంగా, తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినిమా మీద ఉన్న అంచనాలు, అవి చేరుకున్న స్థాయి మధ్య గల గ్యాప్ను స్పష్టంగా తెలియజేశాయి.




























