ఒకప్పుడు యాక్షన్ చిత్రాల హవా ఉండేది.. 1990 తర్వాత ఫ్యాక్షన్ చిత్రాలు రావడం ప్రారంభమైంది. “కడప రెడ్డెమ్మ” చిత్రంతో ప్రారంభమైన ఫ్యాక్షన్ చిత్రాల పరంపర ప్రేమించుకుందాం రా.. సీతారామరాజు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, అది, సాంబా లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీసు వద్ద కొన్ని విజయాన్ని నమోదు చేయగా మరికొన్ని పరాజయాన్ని పొందాయి.

32 ఏళ్ల క్రితం “లారీడ్రైవర్” సినిమాతో ప్రారంభమైన బాలకృష్ణ, బి. గోపాల్ కాంబినేషన్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో కొనసాగింది. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చిత్రాలు అనంతరం ఒకరోజు.. బి.గోపాల్, విజయేంద్రప్రసాద్ కలిసి బాలయ్యబాబు కి కథ చెప్పడానికి వెళ్లారు. కథ మొత్తం విన్నాక ఆయన కొంచెం టైం ఇవ్వండి అని చెప్పారు. బి.గోపాల్, విజయేంద్ర ప్రసాద్ కు ఒకే టెన్షన్ బాలకృష్ణ ఏమంటారో అని.. కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనిది కావడం అదేవిధంగా బాలయ్య బాబుకి రాయలసీమలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం ఈ సినిమాకి కలిసివచ్చిన అంశంగా భావించవచ్చు.

తర్వాత బాలకృష్ణ ఒప్పుకోవడంతో.. నిర్మాత చెంగల వెంకట్రావు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. చాలా విచిత్రంగా ఈ సినిమా కథ తయారయింది.. గుండమ్మ కథ, సింధూరపువ్వు, దుష్మన్ లాంటి చిత్రాల ప్రేరణతో సమరసింహారెడ్డి కథ తయారుచేయబడింది. అది ఎలాగంటే.. సినిమా మొదటి భాగం ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన గుండమ్మకథ చిత్రం లోని వంటవాడు, సినిమా రెండో భాగం రాంకీ, నిరోషా హీరోహీరోయిన్లుగా నటించిన ‘సింధూరపువ్వు’ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్, పగ ప్రతీకారాలతో పూర్తయిన ‘దుష్మన్’ చిత్రం.

అప్పటికే రజనీకాంత్ నటించిన ‘భాష’ లాంటి చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కథలో కూడా మొదటగా ముంబై బ్యాక్ డ్రాప్ లో సినిమా కొనసాగినట్టుగా రాసుకున్నారు. అయితే ప్రముఖ రచయిత రత్నం ముంబై నేపథ్యం కాకుండా రాయలసీమ నేపద్యం తీసుకుంటే మన నేటివిటికి దగ్గరగా ఉంటుందని చెప్పడంతో స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ నేపథ్యాన్ని చేర్చారు. అయితే రత్నం రాయలసీమతో పాటు తన నిజ జీవితంలో ఒకసారి.. “వంగవీటి, దేవినేని” ఇద్దరు రైల్వే స్టేషన్ లో ఎదురు పడ్డప్పుడు ఆ రెండు వర్గాల మధ్య ఎంతటి ఉద్రిక్త వాతావరణం ఎదురయ్యిందనే విషయాన్ని కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కి తెలియజేయడం జరిగింది.

ఆ క్రమంలో హీరో బాలకృష్ణ, విలన్ జయప్రకాష్ రెడ్డి రైల్వేస్టేషన్లో ఎదురుపడి ఉద్రిక్త వాతావరణం సృష్టించే సీన్ రాయడం జరిగింది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ చక్కటి ట్యూన్స్ అందించారు. ముఖ్యంగా సీతారామశాస్త్రి రాసిన “అందాల ఆడబొమ్మ..అనే గీతం ఆ రోజుల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సిమ్రాన్, అంజలాజావేరి,సంఘవిలతో బాలకృష్ణ స్టెప్పులు ఇరగదీశారు. “నీ ఇంటికి వచ్చా..నీ నట్టింటికి వచ్చా.. అని బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ కి థియేటర్లు దద్దరిల్లాయి.

అలా 1999 జనవరి 13న విడుదలైన సమరసింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 73 కేంద్రాలలో 100 రోజులు ఆడగా.. 32 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. 6 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం దాదాపుగా 60 కోట్లను వసూలు చేసింది. ఫ్యాక్షన్ చిత్రాలకు ఈ సినిమా మరింత ఊతం ఇచ్చిందని చెప్పవచ్చు. సమరసింహా రెడ్డి సినిమా ఫిలింఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది.



























