దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదటగా శోభన్ బాబు హీరోగా “బాబు” అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జయసుధ ప్రధానపాత్రలో జ్యోతి అనే సినిమా విడుదలయ్యింది. అలా ఎనిమిదవ సినిమాగా నందమూరి తారక రామారావుతో చేసే అవకాశం రాఘవేంద్ర రావుకు వచ్చింది. వచ్చిన అవకాశం చేదాటిపోకుండా అడవి రాముడు చిత్రాన్ని ఏకంగా బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు తో సింహబలుడు, కేడి నెంబర్ వన్, వేటగాడు, గజదొంగ, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, తిరుగులేని మనిషి చిత్రాలను రాఘవేంద్రరావు రూపొందించారు.

1981లో దేవి వరప్రసాద్ నిర్మాణం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు, రతి అగ్నిహోత్రి, చిరంజీవి, జయలక్ష్మి కలిసి నటించారు. ఈ సినిమాకంటే ముందే కె.రాఘవేంద్రరావు శోభన్ బాబు హీరోగా మోసగాడు అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రంలో చిరంజీవి మొదటి సారి రాఘవేంద్రరావు దర్శకత్వం లో నటించారు.ఆ తర్వాత మళ్లీ రాఘవేంద్ర రావు రూపొందించిన తిరుగులేని మనిషి సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చిరంజీవి పోషించారు. పేరుపొందిన లాయర్ పాత్రలో ఎన్టీరామారావు కనిపించగా, ఆయనకు జోడీగా నటించిన రతిఅగ్నిహోత్రి మాత్రం చిల్లర పర్సులు కొట్టేసే చిరు దొంగగా అల్లు రామలింగయ్యను బాబాయ్ అంటూ దొంగతనాలు చేస్తుంది.

ఫటాఫట్ జయలక్ష్మి ఎన్టీఆర్ చెల్లెలిగా నటించింది. ఈమెను ప్రేమించిన చిరంజీవి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఈ పెళ్లికి ఎన్టీఆర్ తండ్రి జగ్గయ్య ఒప్పుకోరు. జగ్గయ్య తెలియకుండా ఎన్టీఆర్ తన చెల్లిని చిరంజీవికిచ్చి పెళ్లి చేస్తాడు. తన తండ్రి సక్రమమైన మార్గంలోనే తమను పెంచి పోషించి ఉన్నత జీవితాన్ని అందించాడని అనుకున్న ఎన్టీ రామారావుకి తన తండ్రి ఒక స్మగ్లర్ అని తెలుస్తుంది. చివరికి తన తప్పు తెలుసుకొని మారిపోయిన జగ్గయ్యను దుండగులు హతమారుస్తారు.

ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వలన దుండగులతో చేయి కలిపిన తన బావను వారి నుంచి విడిపించి.. చివరికి ఎన్టీఆర్ దుండగుల ఆట కట్టిస్తాడు. ఎన్టీఆర్ చిరంజీవి కొన్ని సన్నివేశాల్లో పోటాపోటీగా నటించారు. కళావాచస్పతి జగ్గయ్య చిరంజీవి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలలోని సంభాషణలు సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేవిదంగా ఉంటాయి.

ఆ విధంగా 1981లో విడుదలైన తిరుగులేని మనిషి చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలోని పాటలు పర్వాలేదు అనిపించుకున్న.. సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఓ చక్కని ఫ్లాప్ గా మిగిలిపోయింది.































