Swetha Nagu : సౌందర్య పదహారణాల తెలుగు అమ్మాయిల మన కుటుంబంలోని తోబుట్టువుల చూడచక్కని రూపం, అద్దానికి అసూయ పుట్టే అందం ఆమె సొంతం. సినిమాలలో అందాల ప్రదర్శనకు ఆవిడ ఆమడ దూరం. సాంప్రదాయ గృహిణి పాత్రలు ఆమెకు పెట్టని ఆభరణం. పట్టు పరికిణి లో ఆమె ఒక తెలుగు తోరణం. పట్టు చీరలో ఓ వెలుగు కిరణం. అజంతా శిల్పాలు, ఎల్లోరా అందాలు ఆమె నిండైన సొగసుకు దిగదుడుపు. అభినవ సావిత్రిగా.. బరువైన పాత్రలు మోసే దరిత్రిగా.. సినిమాలో ఆమె నటన అజరామరం.

ఆత్మాభిమానం చాటే భానుమతిలా.. ఆత్మగౌరవంతో నటించే భానుప్రియలా.. వాలుకళ్ళతో అభినయించే వాణిశ్రీలా.. చిరునవ్వులతో చిందేసే శ్రీదేవిలా.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే పాదరసంలా నటనకే వన్నె తెచ్చి నలుగురిలో శభాష్ అనిపించుకున్న సౌందర్య. 1993 ప్రాంతంలో హరీష్ హీరోగా నటించిన “మనవరాలి పెళ్లి” చిత్రంతో సౌందర్య తెలుగులో అడుగు పెట్టింది. ఆ తర్వాత మేడమ్, అల్లరి ప్రేమికుడు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు లాంటి సినిమాల్లో నటించింది. అనతికాలంలోనే అరుదైన పేరు పొందింది.

సౌందర్య 100వ చిత్రం గా వచ్చిన “శ్వేతనాగు” సంజీవి దర్శకత్వంలో సి. వి. రెడ్డి నిర్మించగా 2004 లో విడుదలైన చిత్రం. ఇందులో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. అబ్బాస్ మరో ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సినిమా మొదట్లో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలనుకున్నారు కానీ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మించబడింది. కన్నడలో “శ్వేతనాగ” అనే పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ప్రధాన తారాగణం ఒకటే అయినా సహాయ నటులు మాత్రం వేరు.

మేఘాలయ నుంచి తీసుకువచ్చిన తెల్లటి నాగుపామును ఈ చిత్రంలో వాడుకున్నారు. తెలుగు వర్షన్ తమిళంలో “మధుమతి” అనే పేరుతో అనువాదం అయింది. ఒక నాగు తనకు హాని చేసిన కథానాయికపై పగబట్టడం, నాగదేవత సాయంతో ఆమె అందులోంచి బయటపడటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.నాగుపాము కథాంశంతో ఇదివరకు అనేక చిత్రాలు రూపొందించబడ్డాయి. కానీ తెల్లనాగుతో ఓ సినిమా రూపొందించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ కథలో కొత్తదనం లేకపోయేసరికి శ్వేతనాగు చిత్రం ప్రేక్షకుల నిరాదరణను చవిచూడాల్సి వచ్చింది.
































