1986 సురేష్ ప్రొడక్షన్స్ లో విడుదలైన ప్రతిధ్వని చిత్రం విజయ దుందుభి మోగించింది. శారద ప్రధానపాత్రలో ఓ సినిమా నిర్మించాలని అనుకున్న డి.రామానాయుడు పరుచూరి బ్రదర్స్ కు చెప్పడంతో ప్రతిధ్వని లాంటి పవర్ ఫుల్ కథను తయారు చేయడం జరిగింది. అది రామానాయుడుకు నచ్చడంతో శారదతో ప్రతిధ్వని చిత్రం తీసి హిట్ కొట్టారు. అది గమనించిన విజయశాంతి పర్సనల్ మేకప్ మాన్ సూర్య మూవీస్ అధినేత ఏ.ఎమ్. రత్నం మా మేడానికి కూడా అలాంటి పవర్ ఫుల్ పాత్రతో కూడిన ఒక కథ తయారు చేయాలని కోరారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ తర్వాత చూద్దామని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

1989 అనగా ఈమాట అన్నాక సరిగ్గా మూడు సంవత్సరాలకు విజయశాంతితో ఒక ఒక పోలీస్ పాత్రలో సినిమా తీయాలనుకుంటున్నాను అని తన మిత్రుడైన మోహన్ గాంధీకి చెప్పడంతో… ఆయన జాతీయ వ్యాప్తంగా పేరుపొందిన పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని ఒక కథ తయారు చేసుకోమని చెప్పారు. వెంటనే ఎ.ఏం.రత్నం, పరుచూరి సోదరులను కలిసి కిరణ్ బేడీ జీవితం ఆధారంగా విజయశాంతికి ఒక కథ రాయాలని చెప్పారు. ఆ క్రమంలో.. పరుచూరి సోదరులు అద్భుతమైన పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని రాయడం జరిగింది. ఆ స్టోరీ ఏ.ఎం.రత్నం, మోహన్ గాంధీలకు నచ్చడంతో విజయశాంతితో సినిమా తీయడానికి సంసిద్ధులు అయ్యారు. పరుచూరి బ్రదర్స్ అప్పటికీ ఆంధ్రాలో ఓ పేరు తెచ్చుకున్న కానిస్టేబుల్ జీవితం ఆధారంగా వినోద్ కుమార్ పాత్రను సృష్టించడం జరిగింది.

మొదటగా రాజశేఖర్, మోహన్ బాబులను సంప్రదించగా వారు ఈ పాత్రను చేయడానికి తిరస్కరించారు. అలా చివరికి ఆ పాత్రను వినోద్ కుమార్ చేయాల్సివచ్చింది. ఇక విజయశాంతికి దీటుగా సరికొత్త విలనిజాన్ని పండించడానికి మొదటగా పరుచూరి గోపాలకృష్ణను అనుకున్నప్పటికీ ఆయన ఆ పాత్ర చేయడానికి నిరాకరించారు. అలా ఓ కొత్త వారిచే విలన్ పాత్ర చేయించాలనే ఉద్దేశంతో… ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ జయరామ్ సలహా మేరకు ప్రముఖ నిర్మాత పుండరీకాక్షయ్యను సంప్రదించారు. తొలుత ఆయన ఈ పాత్ర చేయడానికి నిరాకరించారు. కానీ దర్శకుడు ఏ.మోహన్ గాంధీ పట్టుబట్టడంతో చివరికి కర్తవ్యం చిత్రంలో పుండరీకాక్షయ్య విలన్ గా కనిపిస్తారు.

సమాజంలో అర్ధబలం, అంగబలం గల ఒక రాజకీయ నాయకుడి పాత్రలో పుండరీకాక్షయ్య అద్భుతంగా అభినయించారు. నీ జీవితం మీద విరక్తి పుడుతుందని.. చెప్పే పుండరీకాక్షయ్య సంభాషణ ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఒక ఒక విధంగా చెప్పాలంటే విజయశాంతికి ధీటుగా పుండరీకాక్షయ్య నటన సినిమా విజయానికి మరో కారణమయ్యింది. లెక్కకు మించిన బడ్జెట్ తో (దాదాపు కోటి రూపాయలు) నిర్మించిన ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ 1990 జూన్ లో విడుదలై జగదేకవీరుడు అతిలోకసుందరి, బొబ్బిలిరాజా వంటి చిత్రాలు దాటికి తట్టుకొని మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అద్భుతమైన కథను అందించిన పరుచూరి సోదరులకు నంది అవార్డు వరించింది. అలాగేపవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన విజయశాంతికి నంది అవార్డుతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా రావడం గమనార్హం.


































