గత ఏడాది నుంచి బాక్సాఫీస్ వద్ద బద్దలయ్యే సినిమాలు వచ్చింది చాలా తక్కువ. కరోనా కొట్టిన దెబ్బకి బాక్సాఫీస్ మూతపడింది. దాంతో కొన్ని థియేటర్స్ మూత పడితే కొన్ని గోడాంస్గా మారాయి. కొన్ని కళ్యాణ మండపాలుగా మారాయి. కొన్ని మెయిన్ థియేటర్స్ మాత్రం నాలుగు భారీ హిట్ సినిమాలు వస్తే అన్ని సర్దుకుంటాయని ఆశతో ఉన్నారు. మల్టీప్లెక్స్ గురించి చెప్పేదేముంది. అసలే జనాలు ఆర్ధిక కష్టాలతో అల్లాడిపోతున్నారు. ఏదైనా అద్భుతమైన సినిమా వస్తే చూడాలనే తప్ప.. థియేటర్స్ వరకు వెళ్ళి ఓ రూ.1000 ఖర్చు చేసి రావాలని చాలామందికి లేదు.

ఇదే సినిమా నాలుగు రోజులు పోతే ఓటీటీలోనో మరో నాలుగు రోజులు పోతే టీవీలోనో చూడొచ్చులే ఇప్పుడేమొచ్చింది అంత తొందర అని ఫిక్స్ అవుతున్నారు. అయితే కొన్ని బడా డైరెక్టర్స్ తీస్తున్న సినిమాల మీద మాత్రం జనాల ఆసక్తి బాగానే ఉంది. ముఖ్యంగా పూరి జగన్నాధ్ లాంటి పెద్ద దర్శకులు తీసే సినిమాలు.. వారి ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా అంటే థియేటర్స్లో చూద్దాం అనే ఫీలింగ్లోకి వస్తున్నారు. ఆ కారణంగానే కొన్ని సినిమాల మీద మంచి అంచనాలు పెట్టుకొని థియేటర్స్కు వస్తున్నారు. కానీ సినిమా చూశాక మన వాళ్ళు మారరు. ఇలాంటి సినిమాలు ఇంకా ఎంతకాలం తీస్తారో. అనవసరంగా ఇప్పుడు డబ్బులు దండగ చేశాం.

అని డిసప్పాయింట్తో వస్తున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాల విషయంలో అభిమానులు ఫీలింగ్స్ ఇలానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కరోనా సమయంలోనే పూరి జగన్నాధ్ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ థియేటర్స్ మూతపడటంతో ఆగిపోయింది. రెండు మూడు సార్లు మంచి ఓటీటీ డీల్ వస్తే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని థియేటర్స్లోనే రిలీజ్ చేశారు. ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న జనాలకు రొమాంటిక్ మూవీ మరీ రొటీన్ అని ఫీలవుతున్నారు. ఇలాంటి సినిమాలను చాలా చూశాం.. అనసవసరంగా ఈ సినిమా కి వచ్చామని మాట్లాడుకుంటున్నారట.

కనీసం సినిమాలో ఓ గంట అయినా మ్యాజిక్ ఉంటే ఓకే అని చెప్పుకునే వారేమో. పూరి గత చిత్రాలను కలిపి తీసినట్టుంది అని కామెంట్స్ చేస్తున్నారు. రొమాంటిక్లో రొమాన్స్ కూడా ఇప్పటికే చాలాసార్లు పూరి చూపించేదే అని చెప్పుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా నాగశౌర్య కి హిట్ అనేది దక్కడం లేదు. డీసెంట్ సినిమాలతో ఓ మార్క్ రీచ్ అయిన శౌర్య మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి దెబ్బ తిన్నాడు. ఇలాంటి సమయంలో వరుడు కావలెను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా రిలీజ్ ముందు వరకు మంచి హైప్ క్రియేటయింది.

కానీ థియేటర్స్లో బొమ్మ పడిన తర్వాత చాలామందికి నీరసం వచ్చేసిందని చెప్పుకుంటున్నారు. కథ, కథనం, పాత్రలలో ఏమాత్రం కొత్తదనం లేని ఓ మూస కథతో వరుడు కావలెను సినిమాను తీశారని చెప్పుకుంటున్నారు. ఓ వైపు పూరి సినిమా, ఓ వైపు నాగ శౌర్య సినిమా.. వరుడు కావలెను వర్సెస్ రొమాంటిక్.. ఏది హిట్ అవుతుందో అని మాట్లాడుకున్నారు. అంతేకాదు రెండు డిఫరెంట్ మూవీస్ . కాబట్టి రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయని అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాలను జనాలు పాజిటివ్ గా చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే కరోనా కొట్టిన బాక్సాఫీస్ లెక్కలు మార్చేదెలా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

































