ప్రముఖ సింగర్ బాలసుబ్రమణ్యం.. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు అప్పట్లో పాటలు పాడేవారు. దాదాపు చాలా సంవత్సరాల పాటు సూపర్ స్టార్ అన్ని సినిమాలకు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడేవారు. అతనిలో ముఖ్యమైన సుగుణం ఏమిటంటే ఎవరైనా తనకి ఉపకారం చేస్తే అది ఎప్పటికీ మరిచిపోరు. తనకి ఒకళ్ళు ఈ విధంగా సహాయం చేశారని ఎప్పుడూ అందరితో చెబుతుంటారు బాలసుబ్రమణ్యం. అద్భుత గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు మరణాంతరం అక్కినేని నాగేశ్వరరావు బాల సుబ్రహ్మణ్యం ని తన సినిమాల్లో పాడించేందుకు అంగీకరించలేదట.

అతనికి బదులుగా రామకృష్ణ తనకి పాటలు పాడాలని దర్శక నిర్మాతలతో చెప్పి… రామకృష్ణ ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు నాగేశ్వరరావు. దీంతో ఎన్టీ రామారావు, శోభన్ బాబు తదితర ప్రముఖ హీరోలు కూడా రామకృష్ణని తమ సినిమాలో పాటలు పాడించాలని అనుకున్నారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం కి మధురమైన గాత్రం ఉన్నప్పటికీ… సినిమా అవకాశాలు రావడం దాదాపు అసాధ్యం అయ్యింది. కానీ బాలసుబ్రహ్మణ్యం ఏరోజు నిరాశ చెందలేదు హాస్యనటులకు ఈ పాటలు పాడడానికి కూడా ఒప్పుకునేవారు.

ఇలాంటి తరుణంలోనే సూపర్ స్టార్ కృష్ణ, బాలసుబ్రమణ్యం ని తన వద్దకు పిలుచుకొని మీరేమీ నిరాశ పడకండి నా సినిమాలు సంవత్సరానికి 7- 8 వరకు ఉంటాయి. నా సినిమాలో అన్ని పాటలు మీరే పాడండి అని బాలసుబ్రహ్మణ్యం కి పెద్ద ఆఫర్ ఇచ్చారు. దీంతో బాగా సంబరపడిన బాలసుబ్రమణ్యం నేనంటే నేనే అనే కృష్ణ సినిమాకు మొట్టమొదటిగా పాటలు పాడటం ప్రారంభించారు. ఈ సినిమా 1968 వ సంవత్సరంలో విడుదలై మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీంతో బాలసుబ్రహ్మణ్యానికి మంచి పేరు దక్కింది. సూపర్ స్టార్ కృష్ణ కి బాలసుబ్రహ్మణ్యం గాత్రం చాలా బాగా కుదిరిందని చాలామంది అనడంతో… అతడితోనే తన అన్ని పాటలను పాడించారు కృష్ణ.

ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణ-బాల సుబ్రహ్మణ్యం కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్స్ గా నిలుస్తున్న సమయంలో… వీళ్ళిద్దరికీ చిన్నపాటి మాటల యుద్ధం కొనసాగింది. ఒకానొక సమయంలో ఒక ప్రముఖ నిర్మాత బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడుతూ కృష్ణ గారి సినిమాల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో బాల సుబ్రహ్మణ్యం.. కృష్ణ సినిమాల గురించి ఒక కామెంట్ చేశారు. అయితే ఆ నిర్మాత కృష్ణ గారి వద్దకు వెళ్లి ఆ కామెంట్ ను వక్రీకరించి బాలసుబ్రహ్మణ్యం మీ గురించి ఇలా అంటున్నారని చెప్పారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కృష్ణ వెంటనే బాలసుబ్రహ్మణ్యానికి ఫోన్ చేసి ఏమయ్యా మీరు పాటలు పాడకపోతే నా సినిమాలు హిట్స్ అవ్వ లేవు అనుకుంటున్నారా? అని కోపంగా ప్రశ్నించారు. దీంతో నేను మీ సినిమా పాటలు పాడినా పాడకపోయినా వేరే వారితో పాడించినా అవి కంపల్సరిగా హిట్స్ గా నిలుస్తాయి. ఒకవేళ మీ సినిమాలోని నేను పాడకపోయినా నా గాత్రానికి ఒక విలువ అంటూ ఉంది.. నేను ఏదో ఒక సినిమాలో పాడి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలను అని బాలసుబ్రహ్మణ్యం కొంచెం ఘాటుగా సమాధానమిచ్చారు. ఇది విన్న సూపర్ స్టార్ కృష్ణ ఇంకా కోపం తెచ్చుకొని మరోమాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేసారు.

ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ తన సినిమాల్లో పాటలు పాడేందుకు బాలసుబ్రహ్మణ్యానికి అవకాశం ఇవ్వలేదు. వేరొక సింగర్ కి తన సినిమాల పాటలు పాడేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అతని గాత్రం కృష్ణ కి అంతగా సూట్ అవ్వలేదు. దీంతో సంగీత దర్శకులు కృష్ణ గారి తో మాట్లాడుతూ మీకు ఈ సింగర్ గాత్రం సెట్ అవ్వడం లేదండి. బాలసుబ్రమణ్యం పాడితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. ఇలా రెండు సంవత్సరాల పాటు సూపర్ స్టార్ కృష్ణకి వేరొక సింగర్ పాటలు పాడటం సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా విసుగు తెప్పించింది.

ఒకానొక రోజు వేటూరి సుందరరామ్మూర్తి బాలసుబ్రహ్మణ్యం కి ఫోన్ చేసి మీరు సూపర్ స్టార్ కృష్ణ తో మాట్లాడి మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించుకోండి. మీరు ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీకి మేలు చేసినట్లే అని చెప్పారు. పెద్ద వారి మాట కాదనలేక బాలసుబ్రహ్మణ్యం నేరుగా సూపర్ స్టార్ కృష్ణ ఇంటికి వెళ్లారు. కృష్ణ గారిని కలిసి ఆరోజు నేను ఇలా అనలేదు అని వివరణ ఇస్తూ ఉంటే సూపర్ స్టార్ కృష్ణ వెంటనే అదంతా వదిలేయ్ అని బాలసుబ్రహ్మణ్యం కి ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి… ఇక నుంచి మనం స్నేహ పూర్వకంగా ఉందాం. నా సినిమా పాటలు అన్నీ మీరే పాడండి అని అనడంతో బాలసుబ్రహ్మణ్యానికి సూపర్ స్టార్ కృష్ణకి మధ్యనున్న మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయాయి.






























