ఒకరోజు డి.రామానాయుడు దినపత్రికలో వచ్చిన ఒక జోక్ చదివి చాలాసేపు నవ్వ సాగారు. ఆయన ఎప్పుడు తీయని హాస్య కథ చిత్రం తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో వెంటనే జంధ్యాలకు ఫోన్ చేసి ఒక మంచి హాస్య చిత్రం చేసి పెడతావా అని అడగడం జరిగింది. అప్పుడు జంధ్యాల సరే అనడంతో.. రచయిత ఆదివిష్ణు రాసిన హాస్య కథ అప్పటికే ఒక పత్రికలో సీరియల్ గా వస్తుంది. దానికి కొంచెం ప్రేమ కథను జోడించి.. ఆ కథను ముందు రామానాయుడుకు చెప్పడం జరిగింది. ఈ కథ నాకు కాదు సురేష్ బాబుకు చెప్పండి అతను ఓకే అంటే సినిమా మొదలుపెడదాం అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కథ సురేష్ బాబుకు చెప్పడంతో ఆయనకు బాగా నచ్చి సినిమా ప్రారంభిద్దామని చెప్పాడు.

దర్శకుడు జంధ్యాల “సురేష్ ప్రొడక్షన్స్” లో కథారచయితగా పనిచేసినప్పటికీ దర్శకత్వం చేసే అవకాశం రాలేదు. కాని “అహ నా పెళ్ళంట” సినిమాతో దర్శకత్వం చేసే అవకాశం కుదిరింది. అలా సినిమా కథ.. ఫైనల్ అయిన తర్వాత షూటింగ్ కి వెళ్లేముందు నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలయ్యింది. ఈ హాస్య కథ నచ్చడంతో హీరోగా చేయడానికి వెంకటేష్ ముందుకు వచ్చారు. కానీ హాస్య కథ చిత్రం వెంకటేష్ కు కుదరదని చెప్పడంతో ఆయన డ్రాప్ అయ్యారు.

అప్పటికే “రెండు రెళ్ళు ఆరు” చిత్రంలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ను తీసుకున్నారు. హీరోయిన్ గా రజిని, హీరో తండ్రిగా నూతన్ ప్రసాద్ ను తీసుకున్నారు. ఇక సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్ర పిసినారి లక్ష్మిపతి పాత్ర. నిజంగా పిసినారి అనే పదం వచ్చినట్లయితే చాలామంది ఈ సినిమాలోని కోట శ్రీనివాసరావు చేసిన పిసినారితనాన్ని గుర్తు చేస్తూ ఉంటారు.

నిజంగా ఈ పాత్రకు ముందుగా రావు గోపాల్ రావు అనుకున్నప్పటికీ తర్వాత కోట శ్రీనివాసరావు ను తీసుకున్నారు. ఈ పాత్రకు సంబంధించిన వేషధారణ పూర్తిగా జంధ్యాల గారే శ్రద్ధ తీసుకున్నారు. ముతక పంచే, పొట్టి జుట్టు, పగిలిన కళ్ళజోడులో ఒక అద్దాన్ని పగులగొట్టి కోట శ్రీనివాసరావు కి ఇచ్చారు. బ్రతికున్న కోడిని వేలాడదీసి దానిని చూస్తూ కోడికూర తింటున్నానని కోట శ్రీనివాసరావు, సుత్తి వీరభద్రరావుకి చెప్పడం నిజంగా హాస్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఆయన పని మనిషిగా బ్రహ్మానందం నటించడం జరిగింది. ముందుగా ఈ పాత్రకు సుత్తివేలును అనుకున్నప్పటికీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో అత్తిలిలో ఒక అధ్యాపకునిగా పని చేస్తున్న బ్రహ్మానందం ను ఇంతకు ముందే.. ఒక సమావేశంలో హాస్యం పండించడం జంధ్యాల చూశారు. సుత్తివేలు అందుబాటులో లేకపోవడంతో వెంటనే బ్రహ్మానందమును పిలిపించి.. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు ఇంట్లోపని వాడిపాత్రను ఆయనతో చేయించడం జరిగింది.

డిప్ప కటింగ్ తో నత్తి పలుకుతూ బ్రహ్మానందం చెప్పే సంభాషణలు కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు కడుపుబ్బ నవ్విస్తాయి. “అహ నా పెళ్ళంట” చిత్రం షూటింగ్ హైదరాబాద్ దాని చుట్టూ ఉన్న దేవర, యామిజల ప్రాంతాలలో చేయడం జరిగింది. కొన్ని పాటల నిమిత్తం కేరళలో షూటింగ్ జరిపారు. దాదాపు18 లక్షల రూపాయలు ఈ సినిమాకి ఖర్చు పెట్టారు. అలా ఏకధాటిగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 1987 నవంబర్ 27న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హాస్యరస చిత్రాల్లో “అహ నా పెళ్ళంట” సినిమా ముందువరుసలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
































