Jandhyala Wife Annapurna : తెలుగు సినిమాకు కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు జంధ్యాల. నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఆయన రాసిన డైలాగు ఇప్పటికీ ఫేమస్. ఇక ఆయన సినిమాల ద్వారా తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాకుండా తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల గారు పేరు. అందుకే ఆయనను హాస్య బ్రహ్మ అని అంటారు. ముద్దమందారం సినిమాతో డైరెక్టర్ అయిన జంధ్యాల గారు సుమారు 50 సినిమాలకు డైరెక్షన్ చేసారు. 300 సినిమాలకు పైగా రచయిత గా డైలాగులు రాసారు. ఇక ఆయన మరణించిన తరవాత ఆయన కుటుంబం ఎక్కడా కనబడలేదు. మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భార్య అన్నపూర్ణ గారు ఆయన గురించి ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

నరేష్ కి తెలుగు రాదు…
అన్నపూర్ణ గారు మాట్లాడుతూ కొత్తవారితోనే సినిమా చేయాలని ఎపుడూ జంధ్యాల గారు అనుకోలేదని, నాటకాలు చూసి అందులో బాగా వేసేవారిని పిలిచి సినిమాలో అవకాశాలు ఇచ్చేవరంటూ చెప్పారు. ఇక ప్రదీప్ తరువాత నరేష్ తో ఎక్కువ సినిమాలను చేసిన జంధ్యాల గారు నరేష్ గారితో మొదటి సినిమా ఎలా చేసారు, బాలు గారితో డబ్బింగ్ చెప్పించడానికి గల కారణాలను ఆయన భార్య అన్నపూర్ణ వివరించారు. నరేష్ చెన్నై లోనే పుట్టి చదువుకోవడం వల్ల తనకు తెలుగు మాట్లాడటం వచ్చేది కాదని, అందుకే సినిమా కోసం తనను హీరోగా తీసుకున్నపుడు డబ్బింగ్ చెప్పించాలని అనుకొన్నారట జంధ్యాల గారు, అదే సమయంలో తెలుగు అక్షరాలు నేర్పించి ఎలా పలకాలో కూడా శిక్షణ ఇచ్చారట.

అయితే తెలుగు బాగా మాట్లాడటం లేదని బాలు గారితో డబ్బింగ్ అనుకున్నపుడు విజయ నిర్మల వద్దని తనతోనే డబ్బింగ్ చెప్పించమని అడిగిందట. జంధ్యాల గారు ఈ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే ఆ తరువాత అతని భవిష్యత్ ఏమిటో నాకు తెలియదు అదే బాలు డబ్బింగ్ చెబితే ఆ తరువాత అతని భవిష్యత్ బాగుంటుంది ఇది నా అంచనా అని చెప్పారట. దాంతో విజయ నిర్మల ఒప్పుకున్నారట. అలా నరేష్ కు బాలు డబ్బింగ్ చెప్పారు. అయితే ఆ తరువాత నరేష్ చక్కగా తెలుగు మాట్లాడి తరువాత సినిమాకు తానే డబ్బింగ్ చెప్పాడట.































