తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు వినియోగించడం చర్చనీయాంశమైంది. చెన్నైలోని నీలాంకారై పోలింగ్ కేంద్రానికి ఉదయం చేరుకున్న ఆయన, క్యూలో నిలబడి తన ఓటును వేశారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి.

విజయ్ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనను దగ్గరగా చూసేందుకు, ఫోటోలు తీయడానికి ఒక్కసారిగా ముందుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానా కూలిపోయింది. సపోర్ట్గా ఉన్న కర్రలు వంగిపోవడంతో క్షణాల్లో అక్కడ ఆందోళన వాతావరణం ఏర్పడింది.
అయితే అదృష్టవశాత్తూ ఎవరికి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పోలింగ్ కేంద్రంలోకి అనవసరంగా ప్రవేశించిన వారిని బయటకు పంపించి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్తో పాటు సినీ ప్రముఖులు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించారు.
మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుండగా, రాజకీయ పార్టీలతో పాటు టీవీకే కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. విజయ్ పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి


































