హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026 సంవత్సరానికి సంబంధించిన యాత్రను జూన్ నుంచి ఆగస్టు మధ్య నిర్వహించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు మే 19లోగా తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది.

ఈసారి యాత్రను మరింత క్రమబద్ధంగా, భక్తులకు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథూ లా మార్గాల ద్వారా యాత్ర కొనసాగనుంది. మొత్తం 20 బ్యాచ్లుగా యాత్రికులను పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి పది బ్యాచ్లలో ఒక్కో దళంలో 50 మందికి అవకాశం కల్పించనున్నారు.
యాత్రకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్స్లు లేదా పోస్టు ద్వారా పంపే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియను కంప్యూటర్ ఆధారితంగా, పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించేలా ఎంపిక ఉంటుంది.
శివుడి నివాసంగా భావించే కైలాస పర్వతం, పవిత్ర మానస సరోవర సరస్సు హిందువులతో పాటు బౌద్ధులు, జైనులకు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కరోనా మహమ్మారి, భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయిన ఈ యాత్ర గత ఏడాది తిరిగి ప్రారంభమైంది.
ఖర్చుల విషయానికి వస్తే.. హెలికాప్టర్ సదుపాయంతో కాఠ్మండు నుంచి కాఠ్మండు వరకు జరిగే 11 రోజుల యాత్రకు భారతీయ పాస్పోర్ట్ ఉన్న వారికి సుమారు రూ.3.45 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇతర మార్గాలు, ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ఈ యాత్రకు వెళ్లే వారు ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణం ఉండటంతో శారీరకంగా ఫిట్గా ఉండటం అత్యంత అవసరం.



























