ప్రతీకారం తీర్చుకోవడికోలేక చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు తప్పుడు కేసులు యువకులపై పెడుతున్నారు. మొన్న సికింద్రాబాద్ లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగిందని.. సుచిత్ర వద్ద కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనేవి కేవలం ఆరోపణలు అని మాత్రమే తెలిసింది. దీంతో అప్పటి వరకు కంగారు పడి.. అమాయకులను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసిన వారికి జవాబు చెబుతూ వదిలేశారు.

ఇవి మరువకముందే కేరళలో మరో ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన మైనర్ బాలిక.. తనని ఒక యువకుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని ఆరోపించింది. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు మేరకు పోలీసులు 18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతడిని తమదైన శైలిలో విచారించారు.
కానీ అతడు తాను ఏ తప్పు చేయలేదనే వాదించాడు. అయితే అతడికి డీఎన్ఏ పితృత్వ పరీక్ష చేయగా.. అమ్మాయి గర్భం దాల్చడానికి ఈ యువకుడికి సంబంధం లేదని తేలింది. దీంతో ఆ యువకుడిని పోలీసులు వదిలేశారు. తాను మానసికంగా.. శారీరకంగా చిత్ర హింసలకు గురయ్యానని వాపోయాడు. దీంతో సదరు యువకుడు తరఫు న్యాయవాది పోలీసులపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
తన కొడుకుపై ఆరోపణలు చేసిన ఆ అమ్మాయి కుటుంబం తమకు సమీపంలోనే ఉంటున్నారని.. కనీసం వాళ్లు తమ వద్దకు వచ్చి క్షమాపణలు కూడా అడగలేదని ఆ యువకుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.































