తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అప్పుడెప్పుడో ఓ సినీ కవి చెప్పారు. ఈ విషయాన్ని కాస్త ఒంట బట్టించుకుంటే బాగుండేది.. లేదు ఆలస్యం.. అమృతం.. విషం అన్నారు కదా… దానినైనా అర్థం చేసుకుని తొందరపడి ఉంటే బాగుండేది. అటు ఇటు కానీ సమయంలో తొందరెందుకు? ఏంటిది సూక్తుల మీద సూక్తులు? ఇంతకీ ఎవరి గురించి అంటారా? ఇంకెవరి గురించి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి. ఆయనో స్కెచ్ వేశారు. వేసిన స్కెచ్ మంచిదే. కానీ చాలా ఆలస్యమైంది.. చాలా తొందరపడుతున్నారు.. అటు ఇటు కానీ సమయంలో స్కెచ్ గీశారు. మళ్లీ మొదలు పెట్టేశాం అంటారా? అసలు ఏంటా స్కెచ్? దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు గీయడం వలన అభ్యంతరం ఏంటి? అంటే ఈ ఆర్టికల్పై ఓ లుక్ వేయాల్సిందే..

ట్రెండ్ సెట్ చేసింది వైఎస్సే..
పాదయాత్ర.. ఎన్నికల సమయంలో ఇదొక ట్రెండ్.. ఈ ట్రెండ్ను సెట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి అనడంలో సందేహం లేదు. ఈ పాదయాత్రను నిర్వహించి వైఎస్ ఏకంగా సీఎం పీఠంపై కూర్చున్నారు. ఇక ఆ తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే దారి పాదయాత్ర.. కట్ చేస్తే సీఎం పీఠం. ఏపీలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ సైతం ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. తను మంత్రయ్యారు.. తండ్రిని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు సంబంధించి పవర్ఫుల్ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రాన్ని కేటీఆర్ పఠించాలని అనుకుంటున్నారు. మీరే చెప్పండి.. ఆలస్యమైందా.. కాలేదా? ఎన్నికలకు ముందు చేస్తే జనంలో బాగా నోటెడ్ అవుతారు.. జనం సమస్యల పరిష్కారంపై భరోసా ఇచ్చినట్టుగానూ అవుతుంది. దీనికోసం నాలుగేళ్లు ఆగాలి కదా.. మరి కేటీఆర్ ఎందుకు ఇంత తొందరపడుతున్నట్టు. వేళగాని వేళ ఏ మంత్రమైనా సరే పఠిస్తే ప్రయోజనం ఉంటుందా? దానికో నిర్ధిష్ట సమయం.. సందర్భం ఉంటుంది.

రీకాల్ చేసేంత డెవలప్ చెందలేదు కదా?
అయితే ఈ మంత్రం ఇప్పటి వరకూ ప్రతిపక్షంలో ఉన్నవారు మాత్రమే పఠించారు కాబట్టి కేటీఆర్ ఎన్నికలకు ముందు పఠించినా ప్రయోజనం ఉండేది కాదేమో. ఎన్నికలకు ముందు అది కూడా అధికార పార్టీ నేత పాదయాత్ర అంటే జనం ఎలా రిసీవ్ చేసుకునేవారో తెలిసేది. ఇప్పుడు రిసీవ్ చేసుకున్నా ప్రయోజనం శూన్యం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025 జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ షెడ్యూల్ అంతా ఖరారవుతోందట. అయినా సరే టూ ఎర్లీ కదా.. 2028లో పాదయాత్ర చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ ఆలోచనా విధానం మరోలా ఉంది. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో నిరుద్యోగులు, రైతులు, కరెంట్ కష్టాలవంటివి బీభత్సంగా పెరిగి పోయాయి. కాబట్టి వాటిని జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తీసుకెళ్లి మాత్రం ఇప్పుడేం చేస్తుంది? ఏం సాధిస్తుంది? ఎన్నుకున్న నేతలను రీకాల్ చేసేంత డెవలప్ అయితే మనం చెందలేదు కదా అంటారా? అయితే కేడర్లో ఎంతో కొంత ఉత్సాహాన్ని అయితే తీసుకురావచ్చు. బీఆర్ఎస్ దీపం పూర్తిగా కొండెక్కకుండా కాస్త చమురు పోసే యత్నం. అంతకు మించి గులాబీ బాస్ కేసీఆర్.. తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠంపై కూర్చోబెట్టే యోచన అని కూడా అంటున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..




























