దేశంలో విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల మనకు లాక్ డౌన్ అనే పదం పరిచయమైంది. చాలా సంవత్సరాల నుంచే ఈ పదం వాడుకలో ఉన్నా దేశ ప్రజలకు కరోనా వైరస్ ఈ పదాన్ని పరిచయం చేసింది. మార్చి నెల 25 నుంచి మే 31వ తేదీ వరకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసింది. ఆ తరువాత అన్ లాక్ ను అమలు చేస్తూ కేంద్రం అన్ లాక్, అన్ లాక్ కు నిబంధనలను భారీగా సడలిస్తోంది.

కేంద్రం అన్ లాక్ సడలింపుల వల్ల ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కర్నూలు జిల్లాలోని ఒక ప్రాంతంలో మాత్రం మళ్లీ లాక్ డౌన్ అమలు కానుంది. రెండు రోజుల పాటు అధికారులు లాక్ డౌన్ తో పాటు 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి ఇప్పటికే కఠినంగా లాక్ డౌన్ ను, 144 సెక్షన్ ను అమలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
కర్నూలు జిల్లాలోని దేవరగట్టు ప్రాంతంలో దాదాపు 1000 మంది పోలీసులను మోహరించి కలెక్టర్ ఇక్కడ బన్నీ ఉత్సవానికి బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నరు. ప్రతి సంవత్సరం దేవరగట్టులో దసరా పండుగ తరువాత కర్రల సమరం జరుగుతుంది. గతంలో ఈ కర్రల సమరం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరి కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రాణాలు పోతున్నా అక్కడి ప్రజలు మాత్రం ప్రతి సంవత్సరం బన్నీ ఉత్సవం పేరుతో కర్రల సమరం చేస్తున్నారు.
అయితే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అడుగడునా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు బయట గ్రామాల నుంచి ఎవరూ దేవరగట్టులోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడం 34 గ్రామాల ప్రజలు దివిటీలు, కర్రలతో చేసే యుద్ధం వల్ల రక్తం ఏరులై పారుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ఉత్సవం జరుగుతుండగా కరోనా పరిస్థితుల వల్ల అధికారులు ఈ ఏడాది ఉత్సవం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.





























