హైదరాబాద్ లో కరోనా వైరస్ ప్రభావాన్ని అరికట్టేందుకు ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్, వైద్యాధికారులతో చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా తరచూ గాంధీ ఆసుపత్రి, ఫెవర్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. కరోనా ఐసోలేటెడ్ వార్డులను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గారి భార్య కొన్ని సూచనలు చేశారట. ఈ విషయాన్నీ అనే స్వయంగా వెల్లడించారు.

విధులపరంగా రోజూ ఎక్కడో తిరుగుతున్నారని, ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారని, వైద్యులు, రోగులు తో సన్నిహితంగా మెలుగుతున్నందున ఇంటికి వచ్చేముందు ఆఫీసులోనే స్నానం చేసి రావాల్సిందిగా సూచించారట. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకకుండా అందరు తగు జాగ్రత్తలు వహించాలని.. వైరస్ సోకినా వారు తప్ప మిగిలినవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

గాంధీ ఆసుపత్రిలో ఐసోలేటెడ్ వార్డు ఏర్పాటును అయన సమర్ధించారు. ఐసోలేటెడ్ వార్డును ఇక్కడ నుంచి తొలగించాలని వ్యాఖ్యానిస్తున్న జూనియర్ డాక్టర్లను తాను మందలించానని తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్నప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలని, అంతేగాని రోగులను దూరంగా ఉంచడం కరెక్ట్ కాదని, వైద్యులను దేవుడుగా కొలుస్తారన్న విషయాన్నీ వారికి గుర్తు చేసానని తెలిపారు. పూణే ల్యాబుకు పంపిన రెండు నమూనాలు నెగిటివ్ రావాలని దేవుడిని ప్రార్ధించానని మంత్రి అన్నారు. అదే పాజిటివ్ వచ్చి ఉంటె రాష్టంలో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురయ్యేవారని అన్నారు.
































