తనకు సపోర్ట్ చేసిన వాళ్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. అలాంటి వాళ్లలో మోహన బాబు గారు ఒకరు అని ఆయన స్పష్టం చేశారు. ఆయనకు తనంటే చాలా ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగానే మోహన్ బాబు గారితో ఎవరూ జోక్ చేయరు. ఎందుకంటే ఆయనంటే అందరికీ భయం. కానీ తానొక్కడినే జోక్ చేస్తానని ఆయన తెలిపారు.

ఇకపోతే రామానాయుడు స్టూడియోలో ఓ సినిమాకు సంబంధించి కోర్టు సీన్ చేస్తున్నపుడు మోహన్ బాబు ఓ విషయంపై గట్టిగా అరిచారని ఆయన అన్నారు. దాంతో అక్కడున్న వారంతా వణికిపోయారని ఆయన తెలిపారు. అక్కడ అంతా గొడవ గొడవగా మారిపోయిందని రఘునాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడు తనని ఏం జరిగిందని అడిగే సరికి, తనకు ఏం అర్థం కాక అలానే నిలుచుండి పోయానని ఆయన చెప్పారు. అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావ్ అని తాను అనగానే, శ్రీహరి వచ్చి ఆయన తనని ఎస్వీ రంగారావు అనుకుంటారని అన్నట్టు ఆయన చెప్పారు. అప్పుడు తనకు విషయం అర్థమై, ఆయన చూసే చూపులకు తానెలా బాధ్యుడిని అని ఆయన అనేసరికి, ఒక్కసారిగా పక్కున నవ్వేసి అక్కడినుంచి ఆయన వెళ్లిపోయినట్టు రఘునాథ్ రెడ్డి వివరించారు.
ఇదిలా ఉండగా కోడి రామకృష్ణ గారు కూడా చాలా సినిమాల్లో అవకాశాలిస్తారని ఆయన చెప్పారు. తన నటన నచ్చి ఒక సినిమాలో చేయించుకున్న తర్వాత తప్పనిసరి తరువాతి సినిమాలకు మళ్లీ తనను పిలుస్తారు తప్ప, తనను ఆపే సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. అందరితోనూ తాను చాలా కంఫర్టబుల్గా ఉంటానని, వాళ్లు చెప్పిన టైం కంటే ముందే అక్కడ ఉండడానికి తాను ట్రై చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

































