NTR : దాదాపు 70 సంవత్సరాల క్రితం అంటే 1951లో విడుదలైన “పాతాళభైరవి” చిత్రం అనగానే ఆ అత్యద్భుత జానపద కళాఖండం మనందరికీ గుర్తొస్తుంది. నాగిరెడ్డి, చక్రపాణి 1949లో వాహిని స్టూడియోను తీసుకున్నారు. అలా వారు విజయప్రొడక్షన్ తో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం “షావుకారు”. షావుకారు చిత్రానికి అయితే పేరు బ్రహ్మాండంగా వచ్చింది కానీ కాసులు మాత్రం కురవలేదు. ఎంత పేరు తీసుకొచ్చిన చిత్రమైన కాసులు కురవందే కొత్త కథలు రావు కథలు లేనిదే సినిమాలు లేవు. ఈ సందర్భంలో నాగిరెడ్డి, చక్రపాణిలు కాశీమజిలీ కథలు లేదా అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి కథలతో ఒక జానపద చిత్రాన్ని రూపొందించాలకున్నారు.

విజయ ప్రొడక్షన్స్ వారు అంతకుముందే “గుణసుందరి కథ” చిత్రం హిట్ కావడంతో కే.వి.రెడ్డి గారిని తాము తీయబోయే జానపద చిత్రానికి దర్శకత్వం వహించాల్సిందిగా కోరడం జరిగింది. అప్పుడు విజయ ప్రొడక్షన్స్ వారు ఎన్టీ రామారావును, కె వి రెడ్డి అక్కినేని నాగేశ్వరరావును హీరోగా అనుకున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా తీసుకుందామని సందిగ్ధంలో.. వీరు లోగడ “సంసారం” అనే చిత్రంలో షూటింగ్ లో పాల్గొని విరామ సమయంలో వాహిని స్టూడియోలో టెన్నిస్ ఆడుతూ ఉండేవారు. ఆఫీసులో ఉండి కె.వి రెడ్డి.. అక్కినేని, ఎన్టీఆర్ టెన్నిస్ ఆడే విధానాన్ని చూశారు. అక్కినేని కొట్టిన బాలును ఎన్టీఆర్ రెండు చేతులతో బ్యాట్ తో ఒక రకమైన ఫోర్స్ తో తిరిగికొట్టారు. ఆట ఆడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఆడే విధానం కే.వి రెడ్డికి బాగా నచ్చింది. తన కథలోని తోటరాముడుకు ఎన్టీఆర్ బాగుంటాడని ఆయననే హీరోగా ఎంపిక చేసుకున్నారు. అలా రెండు సంవత్సరాల గాను ఎన్టీఆర్ విజయ సంస్థలో పనిచేయాలి. అలాగే విజయ సంస్థ వారు తీయబోయే నాలుగు చిత్రాల్లో నటించాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇక ఆ రోజు నుండి ఎన్టీఆర్ ఉదయం 4.30 నిమిషాలకు వాహిని స్టూడియోకు రావడం రిజిస్టర్లో సంతకం చేసి కర్రసాము సాధన ఉ.9.00 గం.ల వరకు అభ్యాసన చేయడం. స్టూడియోలో ఉన్న క్యాంటీన్ కి వెళ్లి వారు పెట్టిన రెండు ఇడ్లీలు ఒక వడ తినేవారు. విపరీతంగా కర్ర సాములో పాల్గొనడం వలన వారు పెట్టే రెండు ఇడ్లీలు సరిపోయేవి కావు.. ఆ విషయం తాతినేని ప్రకాశరావు కు తెలియడంతో నిర్మాతలకు చెప్పి ప్రతిరోజు డబుల్ టిఫిన్ పెట్టించారు. పారితోషికంగా రోజు రెండు ఇడ్లీలు ఒక వడ, నెలకు 250రూ.లు ఎన్టీఆర్ కు ఇచ్చేవారు. అలా కష్టపడి పట్టుదలతో సినీ పరిశ్రమలో నిలదుక్కోవాలని ప్రయత్నించిన ఎన్.టి.ఆర్ అనతి కాలంలోనే తన లక్ష్యాన్ని చేరుకున్నారు. 1951లో విడుదలైన “పాతాళ భైరవి” చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అప్పుడే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఎన్టీ రామారావుకి ఈ సినిమాలో నటించడం ఆయన సినీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడిందనడం లో సందేహం లేదు.

































