Naveen Murder Case : స్నేహితుడు పిలిచాడని పార్టీ కి వెళితే నమ్మించి గొంతు నులిమి చంపేశాడు ఫ్రెండ్.ఇక చంపమని చెప్పిందేమో మాజీ ప్రియురాలు. ఒళ్ళు గగూర్పొడిచేలా హత్య చేసి సాక్ష్యాలు దొరకకుండా శవాన్ని కాల్చేసి మళ్ళీ పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఇదంతా హైదరాబాద్ నగరం అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బి టెక్ విద్యార్థి నవీన్ హత్య చరిత్ర. ఇంటర్ లో కలిసి చదువుకున్న నవీన్ ఫ్రెండ్ హరిహర కృష్ణ నే నవీన్ ను పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచి దారుణంగా చంపాడు. ఇక ఇదంతా చేసింది కేవలం ఒక అమ్మాయి కోసమనే విషయమే అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ కేసులో హరిహర కృష్ణ లొంగిపోయి నేనే చేశాను అని చెబుతున్న ఇందులో నిహారిక రెడ్డి అనే యువతి అలాగే మరో కొందరి ప్రమేయం ఉంది అంటూ హత్యకు గురైన నవీన్ కుటుంబ సభ్యులు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. చివరకు నిహారిక రెడ్డిని అలాగే హరిహర స్నేహితుడు హాసన్ ను కూడా పోలీసులు అరెస్టు చేయగా ఎట్టకేలకు నిహారిక నోరు విప్పింది.

నవీన్ హత్య తరువాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాం….
మొదటి నుండి కేసులో కీలక వ్యక్తిగా వున్న నిహారిక రెడ్డి పోలీసుల విచారణలో నోరువిప్పలేదు. ఎక్కువగా ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకుంటా అంటూ బెదిరించింది. చివరకు ఆమెను పోలీసులు ట్రాప్ చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిహారిక ఒక్కొక్కటిగా విషయాన్ని వివరిస్తోంది.

హరిహర చేసిన హత్య అసలు తనకు తెలియదంటూ మొదట బుకాయించిన నిహారిక ఇప్పుడు నవీన్ ను చంపిన తరువాత హరిహర ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించింది. అటు హరిహర కూడా నవీన్ నిహారికను వేదించాడని అందుకే చంపానంటూ హత్య అనంతరం ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం. మొత్తానికి ఈ కేసులో ఒక్కోముడి ఆలస్యంగా అయిన వీడుతున్నాయి. హత్య కు గురైన నవీన్ కుటుంబానికి న్యాయం జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి.































