కరోనా మహమ్మారి తగ్గిపోయినా, దాని ప్రభావాలు మాత్రం ఇంకా భారతీయుల ఆరోగ్యాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య నిపుణులు వెల్లడిస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో కూడా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు అధికమవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా వృద్ధాప్యంలో కనిపించే సమస్యలు ఇప్పుడు యువకుల్లో బయటపడటం వైద్య రంగాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వైద్యుల ప్రకారం, కోవిడ్ సమయంలో ప్రాణాలు కాపాడేందుకు స్టెరాయిడ్స్ను విస్తృతంగా ఉపయోగించారు. అయితే కొందరిలో ఆ మందుల దుష్ప్రభావం ఎముకలపై పడినట్టు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా నడుము భాగంలోని ఫెమర్ హెడ్కు సరైన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల ఎముక కణజాలం బలహీనపడుతూ క్రమంగా దెబ్బతింటోంది. ఈ పరిస్థితిని వైద్య భాషలో “అవాస్కులర్ నెక్రోసిస్” లేదా “బోన్ డెత్”గా పిలుస్తారు.
ఈ సమస్య మొదట్లో చిన్న నొప్పులతో ప్రారంభమైనా, క్రమంగా నడవడం, కూర్చోవడం, మెట్లు ఎక్కడం కూడా కష్టంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. కొందరు యువకులు తీవ్రమైన నడుము నొప్పితో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు, ఎముక పూర్తిగా దెబ్బతిన్న దశలో ఉన్నట్లు బయటపడుతోందని సమాచారం. అలాంటి పరిస్థితుల్లో హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ తప్ప మరో మార్గం ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల మెట్రో నగరాల్లోని ఆర్థోపెడిక్ ఆసుపత్రుల్లో యువత నుంచి ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగాలు, ఫిట్నెస్, యాక్టివ్ లైఫ్స్టైల్తో ఉండాల్సిన వయసులోనే పెద్ద శస్త్రచికిత్సలు అవసరమవడం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంటున్నారు.
వైద్యులు మరో కీలక సూచన కూడా చేస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వారు లేదా ఎక్కువకాలం స్టెరాయిడ్స్ వాడిన చరిత్ర ఉన్నవారు నడుము, తొడలు, మోకాళ్లలో నిరంతర నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దని చెబుతున్నారు. ప్రారంభ దశలో ఈ సమస్య సాధారణ ఎక్స్రేలో కనిపించకపోవచ్చని, అవసరమైతే ఎమ్ఆర్ఐ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. తొలిదశలో గుర్తిస్తే మందులు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులతో సమస్యను అదుపులో పెట్టే అవకాశం ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.



























