సామాన్యులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల పెరుగుదలతో పాటు వంటనూనె, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు వాణిజ్య సిలిండర్ ధర అమాంతం పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచింది. దాదాపు రూ.880 ఉన్న గ్యాస్ ధర రూ.1000 చేరువలోకి వచ్చింది.

ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 దాటింది. డీజిల్ ధర రూ.100 కి చేరువవుతోంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో సామాన్యులకు మరో భారం మోయాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. దీంతో రూ.910 నుంచి సిలిండర్ ధర రూ.1,000 కి పరుగులు పెడుతోంది.
అయితే సాధారణంగా ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయి. ఆగస్టు 1న ధరలు పెంచకుండా పాత ధరలనే కొనసాగించాయి. మళ్లీ సెప్టెంబర్ 1 వరకు ధరల్లో మార్పు ఉండదని సామాన్యులు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సామాన్యలుకు షాక్ తగిలినట్లయింది. గ్యాస్ ధరను రూ. 25 పెంచినట్లు ప్రకటించాయి.
దీంతో హైదరాబాద్ లో రూ.887 ఉన్న సిలిండర్ ధర రూ.912 కి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ రూ.859.5, ముంబైలో రూ.859.5, కోల్కతాలో రూ.886, చెన్నైలో రూ.875.50 ధరకు చేరుకుంది. ఫిబ్రవరి ఒకటి నుంచి కూడా గ్యాస్ ధరలను కంపెనీ పెంచుకుంటూ వస్తోంది. ఈ ధరలు పెరగడం.. తగ్గడం అనేవి అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలపై ఆధారపడి ఉంటుంది.



























