తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన నటుడు షాయాజీ షిండే. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్న షాయాజీ షిండే ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

సాధారణ నేపథ్యం నుండి..
మహారాష్ట్రలోని శంకర్వాడి అనే చిన్న పల్లెటూరులో ఓ సాధారణ రైతు కుటుంబంలో షాయాజీ షిండే జన్మించారు. ఆయన తండ్రి రైతు. మొదట్లో సొంతూరు విడిచిపెట్టి సతారా నగరానికి వెళ్లి అక్కడే చదువుకున్నారు. షాయాజీ షిండేకు సినిమా అంటే పిచ్చి. సినీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. నటుడిగా ప్రయత్నించకముందు కొన్నాళ్లపాటు మహారాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేశారు. అప్పుడు ఆయన నెల జీతం కేవలం రూ.165 కాగా, అందులో రూ.150 ఇంట్లో ఇచ్చి, మిగిలిన పదిహేను రూపాయలు తన ఖర్చులకి ఉంచుకునేవారట. ఆ సమయంలో రూ.400 జీతం అందుకోవాలని ఆయన కలగనేవారట.
నాటకాల నుండి వెండితెరపైకి..
నీల్ కులకర్ణి అనే వ్యక్తి సహాయంతో షాయాజీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ముంబైకు వెళ్లి నటనలో శిక్షణ తీసుకున్నారు. తొలుత ‘శూల్’ అనే హిందీ సినిమాలో బచ్చు యాదవ్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఆ తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి.
తెలుగులో టాప్ విలన్గా, ఇతర భాషల్లో విలక్షణ నటుడిగా లక్షల రూపాయల్లో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు. ‘ఠాగూర్’ సినిమాతో తెలుగులో షాయాజీ సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు భాష నేర్చుకుని మరీ తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం చూస్తే ఆయనకు నటన పట్ల ఎంత అభిరుచి ఉందో అర్థమవుతోంది.
కోట శ్రీనివాసరావు విమర్శలు, ఇప్పుడు రాజకీయ ప్రవేశం
అయితే, ఒకానొక సందర్భంలో షాయాజీ షిండేపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో ఇంత మంచి నటులు ఉండగా, ఆయనకు అవకాశాలు ఇవ్వడం, అతనితో డబ్బింగ్ చెప్పించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినిమాల్లో విజయవంతంగా కెరీర్ కొనసాగిస్తున్న షాయాజీ షిండే, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఇది ఆయన ప్రస్థానంలో మరో కీలక మలుపుగా భావిస్తున్నారు.



























