కరోనా, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజల ఆదాయం లాక్ డౌన్ వల్ల తగ్గింది. లక్షల సంఖ్యలో ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గాయి. ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

దాదాపు రెండు నెలల పాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. దీంతో మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా చేకూరే ఆదాయంతో ఆర్థిక వ్యవస్థను గాడొన పెట్టాలని భావిస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం పెట్రోల్, డీజిల్ 3 నుంచి 6 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పలు ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలను సరిగ్గా అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచడమే సరైన మార్గమని అనిపిస్తోంది. దీంతో ఇంధన ధరలను భారీగా పెరగడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచితే ప్రస్తుతం కేంద్రానికి వస్తున్న ఆదాయానికి అదనంగా 60,000 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం ఎప్పటినుంచి అమలవుతుందనే విషయం తెలియాల్సి ఉంది. వాస్తవానికి చాలా దేశాలతో పోలిస్తే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉంది.

































