ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న వారిలో పోలీసుల సేవలు ఎనలేనివని చెప్పవచ్చు. రాత్రనక పగలనక రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ విధులను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తూ, ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే వారికి వీలు దొరికినప్పుడల్లా కరోనా బాధితులకు సేవ చేస్తూ వారిలో ఉన్న సేవా గుణాన్ని చాటుకుంటున్నారు.

తాజాగా పంజాగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహేశ్కుమార్ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. మహేష్ కుమార్ ఆదివారం రాత్రి 11గంటకు సోమాజిగూడలో విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఇద్దరు చిన్నారులు ఆకలితో ఆహారం కోసం యాచించడం చూసి చలించిపోయాడు. ఆ చిన్నారిని చూసి చలించిన మహేష్ కుమార్ తన కోసం తెచ్చుకున్న క్యారేజ్ స్వయంగా ఆ చిన్నారులకు వడ్డించి వారి ఆకలి తీర్చాడు.
చిన్నారుల పట్ల ఎంతో మానవత్వం చూపిన మహేష్ కుమార్ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లు పోలీస్ కానిస్టేబుల్ మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ… ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు.. నేను ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.కరోనా తర్వాత అతనిని వ్యక్తిగతంగా కలిసి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అంటూ ఆ దేవుడి ఆశీర్వాదం ఆయనపై తప్పకుండా ఉంటాయని కామెంట్ చేశారు. మరికొంత మంది నెటిజన్లు ఈయన మానవత్వానికి సలామ్ చేస్తున్నారు.































