కొందరు ఆవేశంతో చేస్తారో లేదా.. ఆలోచనతో చేస్తారో తెలియదు కానీ.. బారీ నష్టం జరిగి తర్వాత పశ్చాతాపపడుతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది. ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు.. పామూరు బస్టాండ్ సెంటర్లో ఓ బస్సుకు నిప్పు అంటించాడు. ఆ బస్సు కనిగిరి నుంచి పామూరు వెళ్తుంది. అందులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకొక్కరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు కొంతమంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు వచ్చి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు విచారించారు. ఎందుకు ఇలాంటి పని చేశావ్ అంటూ అని అడగ్గా.. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి.. త్వరలో జనసేన అధికారంలోకి వస్తుంది.. వాటి ధరలు తగ్గిస్తుందని అతడు పొంతన లేని సమాధానాలు చెప్పాడు.
అంతేకాకుండా అతడు సీఎం జగన్ ను కూడా అసభ్య పదజాలంతో దూషించాడు. అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని పోలీసులు అనుమానించి.. కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ పేర్కొన్నాడు. అక్కడ మంటల్లో చిక్కుకున్న వాళ్లకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదు.



























