Rahul Gandhi : పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లొంగిపోయారని ఆయన దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ ఫోన్ చేసి మోదీని బెదిరించారా?
ఆపరేషన్ సిందూర్ మొదలైన వెంటనే ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మోదీజీ.. ఏం చేస్తున్నారు అని ట్రంప్ ఫోన్లో అడిగారు. ‘నరేందర్.. సరెండర్’ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలను మోదీ తూచా తప్పకుండా పాటించారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
కాంగ్రెస్ ధైర్యానికి నిదర్శనం 1971 యుద్ధం
కాంగ్రెస్ పార్టీ గతంలో అగ్రరాజ్యాలను ధైర్యంగా ఎదుర్కొన్నదని రాహుల్ గుర్తు చేశారు. “అమెరికా బెదిరింపులను కూడా లెక్కచేయకుండా ఇందిరా గాంధీ హయాంలో 1971లో పాకిస్థాన్ను భారత్ విచ్ఛిన్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడింది, ఎప్పటికీ తలవంచదు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి మహనీయులంతా అగ్రరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులే” అని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ఎవరికీ తలవంచదని ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? దిగువ కామెంట్స్ లో తెలియజేయండి.

































