Ratha Saptami 2025: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య భగవానుడిని ఎంతో పవిత్రమైనటువంటి దేవుడిగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఆదివారం సూర్యదేవుడికి ప్రత్యేకమైన దినంగా భావించి సూర్య దేవుడిని పూజిస్తూ ఉంటాము అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు వంటివి కూడా చేస్తూ ఉంటాము. ఇక సూర్య భగవానుడికి అత్యంత పవిత్రమైన రోజును రథ సప్తమిగా జరుపుకుంటాము.

ఇక ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే రథసప్తమి రోజు ఏం చేయాలి, సూర్య భగవానుడిని ఎలా పూజించాలి? ఏది నైవేద్యంగా సమర్పించాలి అనే విషయానికి వస్తే… సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇలా ఉత్తరాయణంలో మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు.
ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పూజిస్తారు ఉదయమే నిద్రలేచి నది స్నానం ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నది అందుబాటులో లేనివారు ఇంట్లోనే స్నానం చేసే సమయంలో తలపై జిల్లేడు ఆకు రేగుపండును పెట్టుకుని చేయటం ఎంతో మంచిది. ఇలా స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడి రాగి చెంబులో నీటిని వేసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం సూర్య భగవానుడి చిత్రపటాన్ని శుభ్రం చేసి ఎర్రని పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంటిముందు కూడా ఈరోజు రథం ముగ్గులు వేసుకోవడం మంచిది.
ఇక సూర్యోదయం అయిన తర్వాత తూర్పు దిశగా తులసి కోట పక్కన ఆవుపేడతో శుభ్రంగా అలికి , పొయ్యి వేసి అందులో ఆవు పిడకలతో ఆవు పాలను పొంగించి అందులోనే బియ్యం వేసి స్వామివారికి పాల పొంగలి తయారు చేయాలి అనంతరం ఈ పాలు పొంగలిని ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి. అయితే ఏడు చిక్కుడుకాయలతో రథం తయారుచేసి తులసి కోట ముందు పెట్టి ఈ చక్కెర పొంగలి నైవేద్యాన్ని కూడా ఆ రథం ముందు ఉంచి పూజ చేయడం వల్ల సూర్య భగవానుడి దీవెనలు మనపై ఉండి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.






























