Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

నా భర్త ద్వారా నన్ను టార్చర్ చేస్తున్నారు…
20 లక్షలు ఆశ చూపి నా భర్తని ట్రాప్ చేశారని మొదటి నుండి నాకు సపోర్ట్ గా ఉన్న నా భర్త ఇప్పుడు ఎమ్మెల్యే చేప్పినట్లు చేయమని చెప్తున్నాడు. సంతకం చేయాలని ఎమ్మెల్యే నా భర్త ద్వారా ఒత్తిడి తెస్తున్నాడు అంటూ చెప్పారు. గతంలో ఆరోపణలు చేసినపుడు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తనకు రాజీ పడాలని లేకపోయినా మధ్యలో వాళ్ళు బలవంతంగా ఓప్పించారని చెప్పారు నవ్య.

ఇక గ్రామంలో ఎమ్మెల్యే రాజీ పడటానికి 25 లక్షలు ఇచ్చినట్లు అలాగే హైదరాబాద్ లో ఇల్లు కొన్నానంటూ పుకార్లు సృష్టించారు. అభివృద్ధి పనుల కోసం డబ్బు ఇస్తానని చెప్పారే కానీ ఇంకే డబ్బు నేను తీసుకోలేదు. నా వ్యక్తిత్వాన్ని అమ్ముకుని డబ్బు తీసుకునే క్యారెక్టర్ కాదు నాది అంటూ నవ్య ఫైర్ అయ్యారు. నా భర్త 20 లక్షల కోసం నాతో సంతకం చేయించాలని అనుకుంటున్నాడు. భవిష్యత్ లో ముప్పై లక్షలు ఇస్తామంటే చంపేసినా చంపేస్తాడు. ఎమ్మెల్యే, ఒక మహిళా అధికారి ద్వారా నా భర్తని ట్రాప్ చేసారు అంటూ నవ్య ఫైర్ అయ్యారు.


































