న్యూఢిల్లీ: ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా (CERT-In), యాపిల్ డివైజ్ లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్లు మీ ఫోన్లలోకి సులభంగా చొరబడే అవకాశం ఉందని తెలిపింది.

అధికారుల కథనం ప్రకారం, ఈ సెక్యూరిటీ లోపాల వల్ల వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సైబర్ నేరస్థులు మీ అనుమతి లేకుండానే ఫోన్ లో మాల్వేర్ ను రన్ చేయడం, డివైజ్ ను హ్యాక్ చేయడం, లేదా దాన్ని పూర్తిగా పనిచేయకుండా చేయడం వంటివి చేయవచ్చని CERT-In హెచ్చరించింది. ఈ లోపాలు ముఖ్యంగా iOS 18.6 కంటే పాత వెర్షన్ తో పనిచేసే ఐఫోన్లు, iPadOS 17.9.9 కంటే పాత వెర్షన్ తో పనిచేసే ఐప్యాడ్ లను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. కొత్తగా విడుదలైన iPhone 15 మోడల్స్, యాపిల్ వాచ్ లు, మ్యాక్ కంప్యూటర్ లలో కూడా ఈ సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయని తెలిపారు.
పరిష్కారం ఇదే: వెంటనే అప్ డేట్ చేసుకోండి
ఈ భద్రతా లోపాలకు పరిష్కారంగా యాపిల్ సంస్థ ఇప్పటికే సెక్యూరిటీ అప్ డేట్ ను విడుదల చేసింది. వినియోగదారులు వెంటనే తమ ఐఫోన్లు, ఐప్యాడ్ లు, ఇతర యాపిల్ డివైజ్ లను లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలని CERT-In సూచించింది. ఇలా చేయడం ద్వారా ఈ లోపాల నుండి మీ డివైజ్ ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసే విధానం:
- ముందుగా మీ ఫోన్ లో Settings ఓపెన్ చేయండి.
- General ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడ కనిపించే Software Updateపై క్లిక్ చేయండి.
- ఏదైనా కొత్త వెర్షన్ అందుబాటులో ఉంటే, వెంటనే దాన్ని డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేయండి.
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు
డివైజ్ లను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవడానికి సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసుకోవడం తప్పనిసరి. వీటితో పాటు, తెలియని నంబర్ల నుండి వచ్చే అనుమానాస్పద లింక్ లను క్లిక్ చేయకూడదని, అలాగే యాపిల్ స్టోర్ కాకుండా ఇతర థర్డ్ పార్టీ స్టోర్ల నుండి యాప్ లను డౌన్ లోడ్ చేయవద్దని CERT-In వినియోగదారులకు సూచించింది.



























