Shobhu Yarlagadda: ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కు, టాలీవుడ్ కు మధ్య టికెట్ల రేట్ల వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయం పట్ల చాలా మంది సినిమా ప్రముఖులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ తీసుకువచ్చిన విధానం తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేదిగా ఉందంటూ.. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆరోపించారు.

తాజాగా హీరో నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సినిమా థియేటర్లకు వచ్చే కలెక్షన్ల కన్నా.. కిరాణా షాపుకు వచ్చే కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ.. నేరుగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టికెట్ ధర పెంచినా.. కొనుక్కునే సామర్థ్యం ప్రేక్షకుడికి ఉందని.. టికెట్ ధరను తగ్గించి ప్రేక్షకుడిని అవమానించినట్లే అని విమర్శించారు. ఈ విమర్శలకు ఏపీ మంత్రుల నుంచి కౌంటర్లు కూడా వచ్చాయి.

అయితే హీరో నాని చేసిన వ్యాఖ్యలకు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా మద్దతు తెలిపాడు. ఏపీలో టికెట్ ధరల వ్యవహారం దీర్ఘకాలంలో ఎగ్జిబిటర్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని… చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు నానికి మద్దతు తెలుపుతూ.. వరసగా ట్విట్లు చేశారు శోభు యార్లగడ్డ. టికెట్ల విషయంలో ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే దీనిపై ఆధారపడ్డ ఎంతో మందిపై ప్రభావం చూపిస్తుందన్నారు. అయితే దీనికి సొల్యూషన్స్ ను కూడా ఆయన ప్రభుత్వానికి చెప్పారు.
ఎమ్మార్పీలను నిర్ణయించేది ప్రొడ్యూసర్లు:
పన్నుల రూపంలో ఆదాయం పొందాలనుకుంటే ఇలా చేయొచ్చు అంటూ.. అన్ని థియేటర్లలో 100శాతం టికెట్ అమ్మకాలను కంప్యూటరైజ్డ్ చేయందని.. టికెట్ అమ్మకాల విషయంలో ఆటోమేటిక్, రియల్ టైమ్ అప్డేట్ పెట్టండని… టికెట్ ధరల విషయంలో ఉచితం, వేరియబుల్ ధర (సినిమాల విడుదలను బట్టి ధరల నిర్ణయం )లను ఏర్పాటు చేయండని సూచనలు చేశారు. మరొక విషయం చెబుతున్నా అంటూనే ‘‘ఎమ్మార్పిలను నిర్ణయించేది ప్రొడ్యూసర్లు/ వస్తువు తయారీ దారలు మాత్రమే అని ప్రభుత్వాలు కాదంటూ’’ ప్రభుత్వానికి చురకలంటిస్తూ ట్విట్ చేశాడు.
































