కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే… మార్చి 23 నుంచి దశలవారీగా పొడిగించుకుంటూ వస్తోంది కేంద్రం. ఈ నేపథ్యంలో అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సంస్థలు తప్ప మిగిలినవి అన్ని మూత పడ్డాయి. దీని ప్రభావంతో ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నష్టాల బారిన పడ్డాయి. తాజాగా మరోసారి లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే… అయితే ఈసారి కొన్ని సడలింపులు కూడా ప్రకటించింది. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేసింది. ఆయా జోన్లలో ఉన్న వైరస్ ప్రభావాన్ని బట్టి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర హోమ్ శాఖ.

ఈ నేపథ్యంలో మే 7 తర్వాత తమ కార్యకలాపాలు పునఃప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాయి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు. ఈ క్రమంలో ఇప్పటికే తమ ఉద్యోగులకు పలు సంస్థలు ఇమెయిల్స్ కూడా పంపించాయి. మే 7 తరువాత సాఫ్ట్ వేర్ కంపెనీ ఓపెన్ అయితే ఎటువంటి జాగ్రత్తలు, కార్యాచరణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులు ఏఏ జోన్లలో నివశిస్తున్నారు అనే విషయంపై వివరాలు సేకరిస్తున్నాయి. వారు నివసిస్తున్న జోన్లను బట్టి తగు రవాణా సౌకర్యం కల్పించనున్నాయి. ఈ అంశాలపై ఒక ఫారం తమ ఉద్యోగులకు పంపించి డిటేల్స్ నింపి తిరిగి సెండ్ చేయాలని ఈమెయిల్ లో పేర్కొన్నారు.
































