దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, వాయు కాలుష్యం సమస్యల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త విధానాలను అమలు చేస్తున్నాయి. పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకుంటున్న ఈ చర్యల్లో భాగంగా తాజాగా బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ‘బీహార్ ఎలక్ట్రిక్ వాహనాల సవరణ విధానం 2026’కు ఆమోదం లభించింది. ఈ కొత్త విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును మరింత ప్రోత్సహించేందుకు భారీ సబ్సిడీలు, పన్ను రాయితీలు ప్రకటించారు. ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఈ విధానంలో హైలైట్గా నిలిచింది.
ఈ నూతన విధానం ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసే మహిళలకు రూ.1 లక్ష వరకు నేరుగా సబ్సిడీ అందించనున్నారు. ఇది మహిళల స్వయం ఉపాధి, వ్యక్తిగత రవాణా సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని కూడా వేగవంతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర వర్గాలకు కూడా సబ్సిడీ ప్రయోజనాలు విస్తరించబడ్డాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుపై సాధారణ వర్గానికి రూ.10,000 వరకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.12,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలపై కూడా గణనీయమైన సబ్సిడీ ఇవ్వనున్నారు.
వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో మోటార్ వాహన పన్నులో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త ఈవీలను కొనుగోలు చేసే వారికి అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
2030 నాటికి రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే వాహనాల్లో కనీసం 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యం సాధిస్తే ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి, ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈవీ వినియోగం పెరిగే కొద్దీ ఛార్జింగ్ మౌలిక వసతులను కూడా విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. నగరాలు, పట్టణాల్లో ఛార్జింగ్ స్టేషన్లు, మాల్స్, హోటళ్లు, పెట్రోల్ బంకులు, నివాస సముదాయాల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రైవేట్ రంగం సహకారాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
మొత్తంగా బీహార్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రవాణా రంగాన్ని పచ్చదన దిశగా మలిచే కీలక అడుగుగా భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించే ఈ విధానం రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది.



























