Tanikella Bharani : తెలుగు సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గాను అలాగే విలన్ గాను కమెడియన్ గాను సహాయక పాత్రలకు అలాగే డైరెక్టర్ గాను ఇలా అన్నింటా తానేంటో నిరూపించుకుని గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తనికెళ్ళ భరణి. ఆయన ఎన్నో సినిమాల్లో నటిస్తూనే మరోవైపు శివుడి మీద భక్తి పాటలను రాసి కొన్నింటిని పాడారు కూడా. అలా అన్నింటా తన ప్రతిభను చాటుకున్న తనికెళ్ళ భరణి గారు తన చిన్నతనం అలాగే సినిమా రంగంలోకి వెళ్ళకముందు తన జీవితం గురించి మాట్లాడారు.

రౌడీ అవ్వాలని అనుకునేవాడిని…
తనికెళ్ళ భరణి గారికి చదువు అంతగా అబ్బలేదని ఆయనే చెబుతారు. చదువు మీద ధ్యాస లేదని కేవలం సినిమాలు చూడటం స్నేహితులతో తిరగడం లాంటివి చేసేవారట. అదే సమయంలో వాళ్ళుండే పక్కన బస్తీలో గొడవలు, రౌడీలు, నరకడం వంటివి చూస్తూ పెరగడం వల్ల రౌడీలకు అందరూ భయపడుతారు అనే ఉద్దేశంతో నేనూ రౌడీ అవ్వాలని అనుకునేవాడిని అయితే అవన్నీ అయ్యేవి కాదని మళ్ళీ అర్థమైంది. ఇక అదే సమయంలో నన్ను నాటకాల వైపు మా గురువుగారు మళ్ళించారు.

అలా నా జీవితంలోకి నాటకాలు, రచన పరిచయం ఏర్పడ్డాయి అంటూ తెలిపారు. ఇక సినిమాల్లోకి వచ్చాక ‘మాతృదేవో భవ’ సినిమాలో విలన్ గా చేసినపుడు చాలా మంది ఆడవాళ్లు తిట్టారు అంటూ చెప్పారు. ఇక ‘ఆమె’ సినిమాలో మరదలిని వేధించే పాత్రలో నటించినపుడు ఒకసారి నా భార్య, నేను నా భార్య చెల్లిని తీసుకుని సినిమాకు వెళ్తే అక్కడున్న లేడీస్ అందరూ నన్ను తిట్టారు. మరదలిని వేధించానని శాపనార్తాలు పెట్టేవాళ్ళు. ఏదైనా ఊరు వెళితే అక్కడ ఆడవాళ్లు మా ఊరు ఎందుకు వచ్చాడు ఈ వెధవ అని తిట్టుకునేవాళ్ళు, సినిమాల ప్రభావం అంతలాగా ఉంటుంది అంటూ తెలిపారు.

































