మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే జీవనశైలి మార్పులు, డయాబెటిస్, హై బీపీ వంటి కారణాలతో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని “సైలెంట్ కిల్లర్”గా పిలుస్తారు. కాబట్టి కొన్ని చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా గుర్తించడం చాలా అవసరం.

మొదటగా, రాత్రిపూట తరచూ మూత్రవిసర్జనకు లేవడం ఒక ముఖ్యమైన సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కంటే ఎక్కువసార్లు నిద్ర మధ్యలో లేవాల్సి వస్తే, అది కిడ్నీల పనితీరు తగ్గిందనే సూచన కావచ్చు. కిడ్నీల్లోని ఫిల్టర్లు బలహీనపడినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ఇక చేతులు, కాళ్లు లేదా ముఖం చుట్టూ వాపు రావడం కూడా గమనించాల్సిన అంశం. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే శరీరంలో అదనపు ద్రవాలు నిల్వ అవుతాయి. దీని వల్ల పాదాలు, చీలమండలు వాపుగా కనిపించవచ్చు. సాక్స్ లేదా షూస్ వేసుకున్నప్పుడు అసహజంగా గట్టిగా అనిపిస్తే అది సాధారణ విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రంలో మార్పులు కూడా కిడ్నీ ఆరోగ్యానికి అద్దం పడతాయి. ముఖ్యంగా మూత్రంలో రక్తం కనిపించడం ఒక తీవ్రమైన హెచ్చరిక. మూత్రం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యవసరం. ఇది కిడ్నీ రాళ్లు, ఇన్ఫెక్షన్ లేదా మరింత తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు.
అలాగే, నురుగుతో కూడిన మూత్రం రావడం కూడా గమనించాల్సిన లక్షణం. ఇది సాధారణంగా శరీరంలో ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు కనిపిస్తుంది. కిడ్నీలు ప్రోటీన్లను నిలుపుకునే సామర్థ్యం తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కనిపించవచ్చు. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే ఊపిరితిత్తుల్లో ద్రవం పేరుకుపోయే అవకాశం ఉంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస ఆడకపోతే ఇది సాధారణ విషయం కాదని గుర్తించాలి.
ఇంకా ఒక సాధారణంగా కనిపించే లక్షణం నిరంతర అలసట. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల శక్తి స్థాయులు తగ్గిపోతాయి. సరైన విశ్రాంతి తీసుకున్నప్పటికీ అలసట తగ్గకపోతే, అది కిడ్నీ పనితీరులో లోపం ఉండొచ్చని సూచనగా భావించాలి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధుల భారము వేగంగా పెరుగుతోంది. దీని వెనుక జీవనశైలి మార్పులు, అనారోగ్యకర ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయి. అందుకే రిస్క్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యం.
మొత్తానికి, కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, చిన్న చిన్న సంకేతాలను గమనించడం ద్వారా ప్రమాదాన్ని ముందుగానే అరికట్టవచ్చు. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం, సమయానికి వైద్యుల సలహాలు తీసుకోవడం ద్వారా కిడ్నీలను కాపాడుకోవచ్చు.





























