విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి దారితీసినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఆరుగురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జోడుగుళ్లపాలెంకు చెందిన 27 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి ఇటీవల విశాలాక్షినగర్లోని ఓ లాడ్జిలో పుట్టినరోజు జరుపుకుంది. వేడుక సందర్భంగా జరిగిన మాటామాటా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో కొందరు స్నేహితులు ఆమెపై దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి, లాడ్జిలోని మరో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొంతసేపటికి స్పందన లేకపోవడంతో స్నేహితులు తలుపు పగులగొట్టి చూడగా, ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువతిపై దాడి జరిగిన విషయం నిజమని అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి కారణంగానే ఆత్మహత్య జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం ఆరుగురిని అరెస్ట్ చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.































