ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనార్ వివిధ రకాల సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ట్విట్టర్ ద్వారా ఎలాంటి అభ్యర్థనలు వచ్చినా స్పందిస్తున్నారు.

సమస్య గురించి ఎవరైనా ఫొటో తీసి పోస్టు చేస్తే.. దానిని 24 గంటల్లో పరిష్కరిస్తున్నారు. ఇటీవల అతడు బస్సులపై అసభ్యకరమైన పోస్టులు అంటించవద్దని వచ్చిన రిక్వెస్ట్ కు స్పందించి వెంటనే ఆ పోస్టర్లను తొలగించారు. అంతే కాకుండా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగుల జీతాల విషయంలో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని వారికి నెలలో మొదటి తారీఖునే జీతాలు పడే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఇక తాజాగా జరిగిన ఘటనలో ఓ వ్యక్తి టికెట్ తీసుకున్నాడు. సీతాఫల్ మండీకి చెందిన లిక్కిరాజు బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు జీడిమెట్ల డిపో బస్సులో ఎక్కి రూ.100 నోటు ఇచ్చాడు. దానికి చిల్లర లేకపోవడంతో ఆ కండక్టర్ టికెట్ వెనకాల రూ.80 రాసి ఇచ్చాడు. వాటని దిగే ముందు తీసుకోవాలని విన్నవించాడు. కానీ ఆ ప్రయాణికుడు ఆ బస్సు కండక్టర్ ను అడగడం మర్చిపోయాడు.
అయితే ఆ విద్యార్థి ఈ సమస్య గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. స్పందించిన ఎండీ జీడిమెట్ల డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డిని పరిశీలించాలని ఆదేశించారు. అతడు దానిని పరిశీలించి నిజమని నిర్ధారించుకొని అతడి ఫోన్ పేకు రూ.80 చెల్లించాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఎండీ సజ్జనార్ ను , డిపో మేనేజర్ ను ప్రశంసించారు.

































