పండుగ సందర్భంగా ప్రతీ ఒక్కరి ఇల్లల్లో నాన్ వెజ్ వండుకొని తింటుంటారు. అదే ఆ రోజు స్పెషల్ అంటూ చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం లేచి.. స్నానం చేసి పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత బంధువులు, కటుంబసభ్యులతో కలిపి విందు భోజనం ఆరగిస్తారు. అయితే చికెన్, మటన్ తింటున్న సమయంలో చాలామంది జాగ్రత్తగా తినాలని చెబుతుంటారు.

ఎందుకంటే.. గొంతులో ఏమైనా ఇరుక్కుంటే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలు అంతకముందు ఎన్నో జరిగాయి కూడా. అందుకే జాగ్రత్తగా భోజనం చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. ఇలా ఓ వ్యక్తి పండుగ సమయంలో చికెన్ తింటున్న సమయంలో పొరపాటున చికెన్ ఎముక గొంతులో ఇరుక్కుని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా అందియూరు సమీపంలోని కల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కల్లూరు గ్రామానికి చెందిన 56 ఏళ్ల సుబ్రమణ్యన్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. దీపావళి పండగు రోజున అతడు తన స్నేహితుడు అయిన మునిరాజు భోజనానికి ఇంటికి ఆహ్వనించాడు. మునిరాజు ఇంట్లో ఇద్దరు కలిసి కోడి మాంసంతో అన్నం తిన్నారు.
ఆ సమయంలో సుబ్రమణ్యన్ ఓ చికెన్ ఎముక గొంతులో చిక్కుకుని ఇబ్బంది పడ్డాడు. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. దీంతో అతడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడు చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



























