Nara Lokesh : నారా లోకేష్కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారనే ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీనిపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేష్ విషయంలో మాత్రం పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మహానాడులో ఈ అంశంపై చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.

“తెలుగుదేశం పార్టీకి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి. అయితే, మేం ఎప్పుడూ యువతకు పెద్ద పీట వేస్తాం. దేశంలో ఏ పార్టీలోనూ లేనంత మంది యువ ఎంపీలు, ఎమ్మెల్యేలు మా పార్టీలో ఉన్నారు. కేంద్ర కేబినెట్లో కూడా అతి పిన్న వయస్కుడైన మంత్రి మా పార్టీ నుంచే ఉన్నారు. అంతేకాదు, విద్యావంతులైన నాయకులు కూడా మా పార్టీలోనే ఎక్కువ” అని చంద్రబాబు గారు గర్వంగా చెప్పారు.
లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. “కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ ఎంతో చేస్తున్నారు. పార్టీ నియమాల ప్రకారం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన వివరించారు.
తెలుగుదేశం పార్టీలో లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగించాలని చాలా మంది కోరుతున్నారు. మహానాడులో చాలా మంది సీనియర్ నాయకులు, మంత్రులు కూడా లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని చంద్రబాబును కోరారు. దీనిని బట్టి చూస్తే పార్టీ శ్రేణుల్లో లోకేష్ నాయకత్వంపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది భావిస్తున్నారు.
ప్రస్తుతం లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహానాడు తర్వాత ఆయన పార్టీ వ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని అందరూ అనుకుంటున్నారు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో!



























