హైదరాబాద్: ఒక ప్రొఫెసర్ చేసిన చిన్న పొరపాటు భారీ ప్రభావాన్ని చూపింది. 138 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. కానీ ఓ విద్యార్థి జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ తప్పు బయటపడింది. వివరాల్లోకి వెళ్తే, జేఎన్టీయూలో నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జూన్లో నిర్వహించగా, జూన్ 17న ఫలితాలు విడుదలయ్యాయి. చివరి ఏడాదిలోని “ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్” (EIA) అనే సబ్జెక్టులో శ్రీదత్త, మల్లారెడ్డి, షాదన్ కళాశాలలకు చెందిన చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.

విద్యార్థి చొరవతో బయటపడిన తప్పు
ఈ ఫెయిల్యూర్స్పై అనుమానం వచ్చిన శ్రీదత్త కాలేజీకి చెందిన ఓ విద్యార్థి జేఎన్టీయూ పరీక్షల విభాగానికి మెయిల్ పంపాడు. ఆ సబ్జెక్టులో అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అవడం సాధ్యం కాదని, మళ్లీ ఫలితాలను పరిశీలించాలని కోరాడు. వెంటనే అధికారులు స్పందించి 138 మంది ఫెయిల్ అయ్యినట్లు గుర్తించారు. వారి ఆన్సర్ షీట్లను తిరిగి పరిశీలించినప్పుడు అసలు కారణం బయటపడింది.
మూల్యాంకనంలో పొరపాటు, ఫలితాల సవరణ
ఈ సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో వేర్వేరు ప్రశ్నాపత్రాలతో నిర్వహించబడ్డాయి. అయితే, ఆ ప్రొఫెసర్ ఉదయం సెషన్ ప్రశ్నాపత్రాన్ని ఉపయోగించి సాయంత్రం సెషన్ ఆన్సర్ షీట్లను కూడా మూల్యాంకనం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీని వల్ల సాయంత్రం పరీక్ష రాసిన విద్యార్థుల జవాబులకు తప్పు మార్కులు వచ్చాయి.
ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం, సాయంత్రం ప్రశ్నాపత్రాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ షీట్లను తిరిగి మూల్యాంకనం చేయించారు. ఈసారి దాదాపుగా అన్ని ఆన్సర్ షీట్లు పాస్ అయ్యాయి. శుక్రవారం రాత్రి వీరి సరిచేసిన ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఓ విద్యార్థి చూపిన చురుకుదనంతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు బాగుపడింది. ఇలాంటి వ్యవస్థలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.




























