దేశం మొత్తం కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులతో తీవ్ర పోరాటం చేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) వైరస్ కలకలం రేపుతోంది. పందులకు సోకే ఈ వైరస్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. పందులలో ఈ విధమైనటువంటి వైరస్ వ్యాప్తి చెందటం వల్ల ఏకంగా 4800 పందులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

కేవలం రెండు నెలల వ్యవధిలో ఇన్ని పందులు మృతి చెందడంతో రాష్ట్రంలోని రైతులు సుమారుగా రూ.19 కోట్ల రూపాయలను నష్టపోయినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. పందులలో వ్యాపించిన ఈ వైరస్ మొట్టమొదటిసారిగా మార్చి 21న లంగ్లై జిల్లా లంగ్సేన్ గ్రామంలో బయటపడింది. ప్రస్తుతం ఈ వైరస్ తొమ్మిది జిల్లాలలో వ్యాపించి తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే అధికారులు 91 గ్రామాలను స్వైన్ ఫీవర్ ప్రాంతాలుగా ప్రకటించారు.
ఈ 91 గ్రామాలలో ఏకంగా 55 గ్రామాలను కేవలం ఆయ్జోల్ జిల్లాలోనే ప్రకటించారు. ఈ 91 గ్రామాలలో మొత్తం 32 వేల పందులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిజోరాం రాష్ట్రంలో ఈ విధంగా ఇలాంటి వైరస్ పందులకి వ్యాపించడం ఇది మొట్టమొదటి సారి అని అధికారులు తెలిపారు. పందులను అధిక సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
మిజోరాం రాష్ట్రంలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద సంఖ్యలో పందులు మరణించడంతో ఈ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే అధికారులు ఇలాంటి వైరస్ పందుల నుంచి మనుషులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపించదని తెలియజేయడంతో రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.































