ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆంక్షలను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం పోలీసులను చూస్తే ప్రజలు భయంతో ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అంటే కేవలం కఠినత్వం మాత్రమే కాకుండా వారిలో కూడా మానవత్వం ఉంటుందని, వారు సాధారణ ప్రజల పట్ల జాలి, దయ కలిగి ఉంటారని అదిలాబాద్ పోలీసులు రుజువు చేసుకున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పకడ్భందీగా అమలుచేస్తున్నారు. జిల్లాలో లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపట్ల పోలీసులు ఎంతో కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ పట్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపట్ల ఎంతో మానవతా దృక్పథంతో పోలీసులు వారికి సహాయం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని ఆసుపత్రిలో తమ కూతురిని చూయించేందుకు దండేపల్లి గ్రామానికి చెందిన గుడికందుల సతీష్ భాగ్యలక్ష్మీ దంపతులు కూతురి తీసుకొని వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరికి ఎటువంటి వాహనాలు దొరకకపోవడంతో ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారు. వీరి పడుతున్న ఇబ్బందులను గ్రహించిన మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి వారు ఎక్కడికి వెళ్లాలనే విషయాలను తెలుసుకొని స్వయంగా తమ వాహనంలో వారిని వారి ఇంటి దగ్గర దింపి వారి మంచి మనసు చాటుకున్నారు.
అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా అదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డల తల్లులు వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన పోలీస్ అధికారులు వారిని ప్రత్యేక వాహనాలలో లేదా ఉత్తమ పోలీసుల వాహనాలలో వారు చేరాల్సిన గమ్యానికి చేరవేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పోలీసులు అంటే కేవలం కఠిన హృదయమే కాకుండా, మంచి మనసు, మానవత్వం కూడా ఉంటుందని పోలీసులు నిరూపించుకుంటున్నారు.































