ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల పాఠశాలలు పని చేసే పనిదినాలు తగ్గినా వారం రోజుల పాటు సంక్రాంతి పండుగ సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలో పిల్లలు, పెద్దలు ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో జనవరి 11వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

సాధారణంగా విద్యార్థులకు ప్రతి నెలా రెండో శనివారం సెలవు దినంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఈ నెలలో మాత్రం జగన్ సర్కార్ రెండో శనివారం రోజున స్కూళ్లు జరుగుతాయని రెండో శనివారానికి బదులుగా మూడో శనివారం విద్యార్థులకు సెలవుదినంగా ఉంటుందని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఇష్టమైన పండుగ కావడంతో జగన్ సర్కార్ ఎక్కువ సెలవులు ఇచ్చింది.
అయితే సెలవులు ఇచ్చినా విద్యార్థులు నష్టపోకుండా విద్యాశాఖ ప్రణాళికను రూపొందించడం గమనార్హం. ఈ నెలలో 11, 12వ తేదీలలో ప్రభుత్వం సెలవులు ఇచ్చినందు వల్ల ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వారం రోజుల పాటు రోజుకు గంట సమయం పాటు తరగతులు అదనంగా నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తుండగా వారం రోజుల పాటు ప్రతిరోజూ 2 : 30 గంటల వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.
ప్రస్తుతం 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి ఫార్మేటివ్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 23వ తేదీ నుంచి ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్ పరీక్షలు జరగాల్సి ఉండగా ఆ పరీక్షలు వచ్చే నెలలో జరగనున్నాయి. విద్యార్థులకు అన్ని విషయాల్లో ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.































