దేశంలో బంగారం ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లి చేసుకుంటే 10 గ్రాముల బంగారం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

అస్సాం సర్కార్ ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. అమ్మాయి పెళ్లికి బహుమతిగా బంగారం ఇవ్వాలనే ఉద్దేశంతో అస్సాం సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. అరుంధతీ గోల్డ్ స్కీమ్ పేరుతో అస్సాం సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకం అక్కడి ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రయోజనం చేకూర్చేలా పలు పథకాలు అమలులో ఉన్నాయి.
అయితే చాలా రాష్ట్రాలు నగదు రూపంలోనే ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. అయితే అస్సాం సర్కార్ పెళ్లి చేసుకునే అమ్మాయిలకు డబ్బులు ఇవ్వడం కంటే బంగారం ఇవ్వడం వల్లే ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది.. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి కోసం ఖచ్చితంగా బంగారం చేయిస్తారు. అందువల్ల ఈ విధంగా అమ్మాయిలకు బంగారం ఉపయోగపడుతుందని.. డబ్బు ఇస్తే ఆ నగదును అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తారని భావిస్తోంది.
ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నియమనిబంధనలు అమలులో ఉన్నాయి. అమ్మాయి కుటుంబ వార్షిక ఆదాయం ఖచ్చితంగా 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, పెళ్లి చేసుకునే అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. ఈ స్కీమ్ అమలు ద్వారా బాల్య వివాహాలను సైతం తగ్గింవచ్చని అస్సాం ప్రభుత్వం భావిస్తుండటం గమనార్హం.


































