అస్సాం అసెంబ్లీ సంచలనమైన బిల్లును ఆమోదించింది. గోమాంసం సహా ఇతర మాంసం వినియోగం, రవాణా, పశువధను నియంత్రించే పశు సంరక్షణ బిల్లు (ది క్యాటిల్ ప్రిజర్వేషన్ బిల్లు)ను ఆమోదించింది. చట్టాన్ని ఆమోదించిన వెంటనే బీజేపీ నేతలు భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేసి సభను హోరెత్తించారు. జూలై 12న సభలో ప్రవేశపెట్టగా.. అస్సాం అసెంబ్లీ తాజాగా ఆమోదం తెలిపింది. డాక్యూమెంట్లు లేకుండా పశువులను ఒకదగ్గర నుంచి మరో ప్రదేశానికి రవాణా చేయరాదు.

ఈ బిల్లులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ నేరాలుగా కూడ పరిగణిస్తారు. అంతేకాకుండా జరిమానాను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలనే ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.
ఈ బిల్లును ఆమోదిస్తున్న సమయంలో బిల్లును వ్యతిరేకిస్తూ ఏకైక స్వతంత్ర శాసనసభ్యుడైన అఖిల్ గొగోయ్ సభ నుంచి వాకౌట్ చేశారు. అంతేకాకుండా ఈ బిల్లును అసెంబ్లీ కమిటీకి పంపాలని ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వాన్ని కోరాగా సీఎం హిమంత బిశ్వ శర్మ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ బిల్లును తప్పు పట్టే అంత ఏం లేదని.. ఇది మత సామరస్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
అస్సాం పశువుల సంరక్షణ చట్టం-1950ని రద్దు చేసి.. మరో కొత్త చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. బిల్లులోని నిర్వచనంలో గేదెలను అనే పదాన్ని తొలగించాలని..AIUDF శాసనసభ్యుడు అమీనుల్ ఇస్లాం చేసిన సవరణ ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. పశువుల వధ, వినియోగం, రవాణాను నియంత్రించడానికి తగిన చట్టపరమైన నిబంధనలు లేని పశువుల సంరక్షణ చట్టం రద్దు చేయాలని సీఎం అసెంబ్లీలో పేర్కొన్నారు.






























