ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా వైరస్ పుట్టుకకు అసలు కారణం తెలియకపోయినా చాలామంది గబ్బిలాల వల్ల ఈ వైరస్ విజృంభించిందని భావిస్తున్నారు. ఈ వైరస్ విజృంభణ తరువాత గతంతో పోలిస్తే మాంసాహారం వినియోగం భారీగా తగ్గింది. పలు దేశాలు గబ్బిలాల అమ్మకాలను నిషేధించాయి. అయితే ఒక దేశంలో మాత్రం ఇప్పటికీ గబ్బిలాల అమ్మకాలు కొనసాగుతున్నాయి.

ఇండోనేషియా దేశంలో గబ్బిలాల విక్రయాలు కొనసాగుతున్నయి. వలల సహాయంతో గబ్బిలాలను పట్టుకుని రెక్కలను కత్తిరించి దానితో వంటకాలు చేసి అమ్ముతారు. ఈ వంటకాలకు డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ భయం ఉన్నా అక్కడి ప్రజలు మాత్రం గబ్బిలాలను తింటూ ఉన్నారు. వీటితో పాటు అక్కడ బల్లులు, పందులు, ఎలుకలు, పాములు, ఇతర జంతువులను కూడా విక్రయిస్తున్నారు.
అక్కడి వ్యాపారులు మొదట్లో ప్రజలు గబ్బిలం మాంసం అంటే భయపడిపోయే వారని అయితే రానురాను ప్రజల్లో వైరస్ గురించి భయాందోళన తగ్గిందని అందువల్లే ఏ మాత్రం టెన్షన్ పడకుండా మాంసం కొనుగోలు చేసి తింటున్నారని సమాచారం.గబ్బిలంలో తయారు చేసిన వంటలు రుచిగా ఉంటున్నాయని ఆ వంటలు తినడానికి ఆసక్తి చూపిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
గబ్బిలం అమ్మకాలపై ఎవరూ నిషేధం విధించలేదని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రావడం లేదని అందువల్లే గబ్బిలం అమ్మకాలను కొనసాగిస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. తాము శుభ్రమైన వాతావరణంలో పెరిగిన గబ్బిలాలనే అమ్ముతామని అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు.































